ఏడాది క్రితం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) చైర్మన్ ముకేష్ అంబానీ స్థానంలో భారతదేశ అత్యంత సంపన్నుడిగా ఎదిగిన అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ తన స్థానాన్ని కోల్పోయారు. అదానీ గ్రూపు కంపెనీలపై అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ రిసెర్చ్ సంస్థ ఇచ్చిన నివేదిక గౌతమ్ అదానీ రాతను మార్చివేసింది.
అదానీ గ్రూపు కంపెనీల షేర్లు భారీగా పతనం కావడంతో గౌతమ్ అదానీ ఆస్తుల విలువ తగ్గిపోగా మళ్లీ దేశంలోనే నంబర్వన్ సంపన్న హోదాను ముకేష్ అంబానీ దక్కింపకున్నారు. గత 50 రోజుల కన్నా తక్కువలోనే 50 బిలియన్ డాలర్లను నష్టపోయిన అదానీ ఇప్పుడు ముఖేష్ అంబానీ కన్నా 400 మిలియన్ డాలర్ల పేదగా మారిపోయారు.
హిండెన్బర్గ్ నివేదిక వెల్లడైన నాటి నుంచి అదానీ గ్రూపు కంపెనీల షేర్లు నిత్యం పతనమవుతూనే వస్తున్నాయి. రోజూ బిలియన్ల డాలర్ల సంపదను అదానీ కోల్పోతూనే ఉన్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నాటికి అదానీ కంపెనీల నికర విలువ 84 బిలియన్ డాలర్లు కాగా ముఖేష్ అంబానీ కంపెనీల నికర విలువ 84.4 బిలియన్ డాలర్లుగా ఉంది.
హిండెన్బర్గ్ నివేదిక వెలువడడానికి ముందు గత ఏడాది డిసెంబర్ 13న అదానీ కంపెనీల నికర విలు 134.2 బిలియన్ డార్లు కాగా ఫిబ్రవరి 1వ తేదీ నాటికి దాని విలువ 84 బిలియన్ డాలర్లకు పడిపోయింది. గత ఐదు రోజులలో అదానీ టోటల్ గ్యాస్ షేర్లు 50 శాతానికి పైగా క్షీణించాయి.
ఒక్క వారంలోనే అదానీకి చెందిన ఎన్డిటివి షేర్లు 15 శాతానికి పైగా పడిపోయాయి.ఇక ప్రపంచ సంపన్నుల జాబితా విషయానికి వస్తే ముఖేష్ అంబానీ తొమ్మిదవ స్థానంలోకి రాగా మూడవ స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ ఇప్పుడు మొదటి పదిమందిలో లేరు.