ఒడిషాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన బాలాసోర్ జిల్లాలోని రైలు మార్గం మీదుగా పునరుద్ధరించిన పట్టాలపై సోమవారం వందేభారత్ రైలు వెళ్లింది. ఈ తొలి హైస్పీడ్ ప్యాసింజర్ రైలు హౌరా పురి వందేభారత్ మూడు ప్రమాదాలు జరిగిన చోట ట్రాక్లపై వెళ్లుతున్న దశలో అక్కడ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇతరులు ఉన్నారు.
డ్రైవర్ల వైపు మంత్రి అభివాదం చేశారు. అంతకు ముందు ఈ రూట్లో గూడ్స్ రైలు వెళ్లిన దశలో రైల్వే మంత్రి చేతులు జోడించి కొద్ది సేపు ప్రార్థన చేశారు. ఈ ప్రాంతంలో పూర్తిగా దెబ్బతిన్న రైల్వే ట్రాక్ మరమ్మతు పనుల పర్యవేక్షణకు రైల్వే మంత్రి ఇక్కడ ఉన్నారు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో బహానగా బజార్ స్టేషన్ను వందేభారత్ రైలు దాటింది.
ఆదివారం రాత్రి ఈ ప్రాంతంలో ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి అయినట్లు రైల్వే మంత్రి వివరించారు. యుద్ధ ప్రాతిపదికన ఈ పనులను చేపట్టారు. ఘోర ప్రమాదం జరిగింది. అయితే ఇకపై సాగే ప్రయాణాలు సాగాల్సి ఉంటుంది. అందుకే తాను ఇక్కడ బసచేసి మరమ్మతు పనులను పరిశీలించినట్లు, ఇప్పుడు ఈ పట్టాల మీదుగా వందేభారత్ వెళ్లినట్లు ఆ తరువాత మంత్రి విలేకరులకు తెలిపారు.
ఆదివారం రాత్రి ఈ రూట్లోనే బొగ్గు లోడ్తో వైజాగ్ పోర్టు నుంచి రూర్కేలా స్టీల్ ప్లాంట్కు గూడ్స్ రైలు వెళ్లింది. మూడు యాక్సిడెంట్లు జరిగిన చోట ట్రాక్పై అన్ని రైళ్లు ఇప్పుడు చాలా తక్కువ వేగంతో సాగుతున్నాయి. ఈ మార్గంలో ఇక అన్ని రైళ్లు యధావిధిగా ప్రయాణించేందుకు వీలేర్పడిందని రైల్వే మంత్రి తెలిపారు. ఈ ట్రాక్పైనే భువనేశ్వర్ న్యూఢిల్లీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ కూడా సోమవారం తెల్లవారుజామున వెళ్లింది.
కాగా, జరిగిన రైలు ప్రమాదంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదైంది. వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. రైల్వే చట్టం కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులపై రైల్వే చట్టంలోని సెక్షన్ 153, 154, 175 కింద కటక్లోని ప్రభుత్వ రైల్వే పోలీసులు (జి ఆర్ పి) ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
బాలాసోర్ జీఆర్పీఎస్ ఎస్ఐ పాపుకుమార్ నాయక్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదైంది. శుక్రవారం జరిగిన ఘోర ప్రమాదంలో మూడు రైళ్లు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో 288 మంది మృతి చెందగా.. దాదాపు వెయ్యి మందికిపైగా గాయపడ్డారు.