అదానీ కంపెనీ ఉత్పత్తి చేసే 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ను సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకి) ద్వారా కొనుగోలు చేయాలన్న ఒప్పందాలను సవాల్ చేసిన కేసులో మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. భారీ పెట్టుబడులు, వాణిజ్య సంబంధ అంశాలపై దాఖలైన కేసుల్లో జోక్యం చేసుకోలేమని చెప్పింది.
ప్రతివాదుల వాదనలు విన్న తర్వాతే తగిన విధంగా స్పందిస్తామని ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యుత్ పంపిణీ సంస్థలు, కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సిఇఆర్సి), ఎపి విద్యుత్ నియంత్రణ మండలి (ఎపిఇఆర్సి), సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకి) తమ వాదనలతో కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని చీఫ్ జస్టిస్ పికె మిశ్రా, జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తితో కూడిన డివిజన్ బెంచ్ నోటీసులు జారీ చేసింది.
7 వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ కొనుగోలుకు అనుమతినిస్తూ ఎపిఇఆర్సి జారీ చేసిన అనుమతులను, సోలార్ విద్యుత్ ధరలను సిఇఆర్సి నిర్ణయిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పిల్ దాఖలు చేశారు.
సిఇఆర్సి నిర్ణయించిన ధరల కంటే తక్కువకే ఓపెన్ మార్కెట్లో విద్యుత్ ఉందని, సోలార్ విద్యుత్ ప్యానెళ్ల తయారీని కూడా విద్యుత్ కొనుగోళ్లలో భాగం చేయడం అన్యాయమని పిటిషనరు తరపున సీనియర్ న్యాయవాది డి ప్రకాష్రెడ్డి వాదించారు.
సెకితో అగ్రిమెంటు జరిగితే రాష్ట్ర విద్యుత్ రంగం సమస్యల్లో కూరుకుపోయే ప్రమాదం ఉందని, స్టేటస్కో ఆర్డర్ జారీ చేయాలని కోరారు. భారీ పెట్టుబడులతో ముడిపడిన వ్యవహారంలో ప్రాథమిక దశలోనే యథాతథస్థితి ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. విచారణను జూన్ 22కు వాయిదా వేసింది.