అదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాలు కారణంగానే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో పేదలపై వేల కోట్ల రూపాయలు భారం వేస్తున్నారని టిడిపి నేత, మాజీ ఎమ్యెల్యే దూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. ఎక్కడైనా పెద్దోడ్ని కొట్టి.. పేదోడికి పెడతారు.. కానీ ఎపిలో పేదోణ్ణి కొట్టి అదానీకి దోచి పెడుతున్నారని, ప్రజలేమైనా ఫర్వాలేదు.. అదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాలు మాత్రం ఆగకూడదనే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. జగన్ సీఎం అయ్యాక ఎపిఇఆర్సి రాష్ట్రంలో విద్యుత్ కోతలకు ఆదేశాలిచ్చే సంస్థగా మారిందని దుయ్యబట్టారు.
విద్యుత్ కోతలపై ఎపిఇఆర్సి ఆదేశాలు జారీ చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ అసమర్థత, వైఫల్యాలను కప్పి పుచ్చేందుకు ఎపిఇఆర్సి ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. ఏపీలోనే సోలార్ పవర్ రూ. 2కే లభ్యమవుతోంటే, అదానీ దగ్గర నుంచి రూ. 4కు విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరమేంటని ఆయన ప్రశ్నించారు.
యూనిట్ రూ.12కు మించకుండా విద్యుత్ కొనుగోలు చేయొద్దంటూ ఎపిఇఆర్సి సీలింగ్ విధించడం పట్ల నరేంద్ర విస్మయం వ్యక్తం చేసారు. వ్యవసాయానికి అందించే విద్యుత్ను తొమ్మిది గంటల నుంచి ఏడు గంటలకు తగ్గించారని, ఇప్పుడు రోజుకు గంట విద్యుత్ సరఫరా ఉండడం కూడా గగనంగా మారిందన్నాని విమర్శించారు. విద్యుత్ కోతలతో ఆక్వా రంగం అల్లాడుతోందని తెలిపారు. పవర్ కట్లు.. పవర్ హలిడేల్లో మాత్రం జగన్ ప్రభుత్వం ప్రగతిని సాధించిందని ఎద్దేవ చేశారు.
ఒకప్పుడు వెలుగుల ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అంధకార ఆంధ్రప్రదేశ్గా మారిందని దయ్యబట్టారు. టిడిపి హయాంలో ఒక్క రూపాయి కూడా ఛార్జీ పెంచలేదని నరేంద్ర గుర్తు చేశారు. ఒక్క ఛాన్స్ అని వేడుకున్న జగన్.. ఇప్పుడు ఛార్జీలతో బాదేస్తున్నారని విమర్శించారు.
జగన్ అనాలోచిత వైఖరి వల్ల.. ఎపిలోని విద్యుత్ కోతల నేపథ్యంలో ఎపికి రావల్సిన పరిశ్రమలన్నీ తెలంగాణకు తరలిపోతున్నాయని వివరించారు. ఎపిలో ప్రస్తుతం ఉన్న పరిశ్రమలు కూడా తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయని, ఇక కొత్త పరిశ్రమలు రావడానికే భయపడుతున్నాయని పేర్కొన్నారు.