డాలర్తో పోల్చితే మన రూపాయి రోజు రోజుకు చిక్కిపోతోంది. 2022 జనవరి నుంచి రూపాయి విలువ ఏకంగా నాలుగు శాతం పతనమైంది. 2021లో డాలర్తో 73.21 ఉన్న రూపాయి విలువ ఆరు శాతం తగ్గి ప్రస్తుతం 77.69కి చేరింది. అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లును సవరిస్తే మన రూపాయి మరింత పతనం అయ్యే అవకాశం ఉంది.
2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి రూపాయి వేగంగా పతనం అవుతోంది. 2017లో మారకం విలువ 64 ఉంటే, ఇప్పుడు 77.69 అయ్యింది. ఇంత భారీగా రూపాయి విలువ పతనం కావడంతో దేశ ఆర్థిక వ్యవస్థపై పెను భారం పడుతోంది. ముఖ్యంగా చమురు దిగుమతుల భారం భారీగా పెరుగుతోంది.
దీనికి తోడు రష్యా, ఉక్రేయిన్ యుద్ధం వల్ల చమురు ధరలు పెరుగుతున్నాయి. ఫలితంగా మన చమురు దిగుమతులు బిల్లు భారీగా పెరుగుతోంది. దేశ అవరాల కోసం 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్నాం.
రూపాయి పతనం వల్ల మనం దిగుమతి చేసుకునే సెల్ ఫోన్లు , ల్యాప్టాప్లు, ఎల్యిడీ టీవీలు, డిజిటల్ కెమేరాలు, ఎలక్రానిక్స్ పరికరాలు ఇలా అనేక రకాల దిగుమతులకు అధికంగా చెల్లించాల్సి వస్తోంది. చమురు ధరలు పెరగడం వల్ల నిత్యావసరాల రేట్లు పెరుగుతున్నాయి. ఇది సామాన్యలపై పెనుభారం మోపుతోంది.
దిగుమతి చేసుకునే ముడిసరుకుతో తయారవుతున్న వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఈ భారాన్ని కంపెనీలు వినియోగదారు లపైనే మోపుతున్నాయి. ధరల పెరుగుదల ద్యవ్యోల్భణానికి దారితీస్తుంది. ఈ పరిస్థితిని నివారించేందుకు ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది.
ఇది బ్యాంక్ల్లో రుణాలు తీసుకుని ఈఎంఐలు చెల్లిస్తున్న వారిపై అధనపు భారం పెంచుతుంది. విద్యా రుణాలు భారం అవుతాయి. విదేశాల్లో చదివే విద్యార్ధుల ఫీజుల భారం పెరుగుతుంది. విదేశాలకు వెళ్లేవారిపై కూడా అధనంగా ఛార్జీల భారం పడుతుంది.
రూపాయి మారకం విలువను పెంచుతామని పాలకులు హామీలు ఇవ్వడమే తప్ప ఆచరణలో ఈ దిశంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే మన రూపాయి రోజు రోజుకు చిక్కిపోతూ, సామాన్యులు, మధ్యతరగతి వారికి చుక్కలు చూపుతోంది.
రికార్డు స్థాయిలో పెరిగిన వాణిజ్య లోటు
మరోవంక, మన దేశ వాణిజ్యలోటు రికార్డ్ స్థాయిలో పెరిగింది. నెలవారి ఎగుమతులు, దిగుమతుల విషయంలో మే నెలలో భారీ వ్యత్యాసం నమోదైంది. మే నెలలో వాణిజ్య లోటు 23.33 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మన ఎగుమతులు 37.3 బిలియన్ డాలర్లతో 15.5 శాతంగా ఉన్నాయి. దిగుమతులు 60.62 బిలియన్ డాలర్లతో 56.1 శాతం పెరిగాయి.
కేంద్ర వాణిజ్య, పరిశ్రమ మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం గత నవంబర్లో అత్యధికంగా వాణిజ్యలోటు 22.91 బిలియన్ డాలర్లుగా ఉంది. వివిధ రకాల సరకుల ఎగుమతులు 7.2 శాతం తగ్గి, 40.19 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఫలితంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొదటి రెండు నెలల్లో వాణిజ్యలోటు 41.73 బిలియన్ డాలర్లు అయ్యింది.
ఏప్రిల్ , మే నెలలో ఇది 21.82 బిలియన్ డాలర్లుగా నమోదైంది. మన దేశం నుంచి జరిగిగే పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 52.7 శాతం తగ్గిపోయాయి. ఎలక్ట్రానిక్స్ 41.5 శాతం, టెక్స్టౖౖెల్స్ గార్మెంట్స్ 22.9 శాతం నమోదు కావడంతో ఎగుమతుల వృద్దికి తోడ్పాటు ఇచ్చాయి. వరసగా మూడు నెలల పాటు మన చమురు దిగుమతులు 60 బిలియన్ డాలర్లుగా ఉంది.
బంగారం దిగుమతులు కూడా ఈ కాలంలో బాగా పెరిగాయి. ఈ సంవత్సరం ఏప్రిల్లో 1.7 బిలియన్ డాలర్ల మేర బంగారం దిగుమతులు జరిగితే, మే నెలలో ఇది మూడింతలు పెరిగి 5.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. పరిస్థితి ఇలానే ఉంటే ఈ ఆర్థిక సంవత్సరం ప్రతి నెల వాణిజ్యలోటు 20 నుంచి 25 బిలియన్ డాలర్ల వరకు ఉండే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచాన వేస్తున్నారు.