కేంద్ర పధకాలను, నిధులను తమ పథకాలుగా కేసీఆర్ ప్రభుత్వం ప్రచారం చేసుకొంటున్నదని అంటూ ప్రధాని మోదీ నుండి రాష్ట్ర స్థాయి బీజేపీ నాయకుల వరకు నిత్యం ఆరోపణలు చేస్తుండగా, కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అమలు పరుస్తున్న `మిషన్ భగీరథ’ పధకాన్ని కేంద్ర ప్రభుత్వం తమ పథకంగా ప్రచారం చేసుకొంటున్నట్లు రాష్ట్ర మంత్రి కెటి రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘జల్ జీవన్ మిషన్’ పథకంలో భాగంగా తెలంగాణలోని 54 లక్షలకుపైగా ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చామంటూ కేంద్ర జలశక్తి శాఖ చేసిన ట్వీట్ పై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ‘‘కేంద్ర సర్కారు సిగ్గు లేకుండా.. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న ‘మిషన్ భగీరథ’ పథకాన్ని తనదిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది’’ అని ఆయన విమర్శించారు.
తెలంగాణలో ఇంటింటికీ తాగునీటి పథకానికి కేంద్రం నుంచి 19వేల కోట్ల నిధులు సమకూర్చాలని నీతి ఆయోగ్ చేసిన సూచనలను అసలు కేంద్ర పట్టించుకోలేదని, కేంద్ర సర్కారు ఒక్క పైసాను కూడా విదిల్చలేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇప్పుడదే పథకాన్ని తనదిగా చెప్పుకుంటూ కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం సరికాదని కేటీఆర్ పేర్కొన్నారు.
‘షేమ్ ఆన్ యూ ఎన్పీఏ గవర్నమెంట్’ అని కామెంట్ చేశారు. తెలంగాణలో జల్ జీవన్ మిషన్ అమలుకు సంబంధించిన గణాంకాలతో కేంద్ర జలశక్తి శాఖ చేసిన ట్వీట్ ను తన పోస్ట్ లో కేటీఆర్ ట్యాగ్ చేశారు. ఈ మేరకు కేంద్రం జల్ జీవన్ మిషన్లో చేపట్టినట్టుగా ఉన్న ఓ యాడ్ ఫొటోని తన ట్విట్టర్లో కేటీఆర్ షేర్ చేశారు. ఇప్పుడుది వైరల్ కావడంతో కేంద్ర ప్రభుత్వం తీరుమీద, బీజేపీ నేతల మీద పిచ్చి పిచ్చిగా కామెంట్స్ వస్తున్నాయి.
బండి సంజయ్పై ఎందుకు చర్య తీసుకోలేదు!
బిజెపి జాతీయ అధికార ప్రతినిధి నుపుర్ శర్మను సస్పెండ్ చేయడం గురించి స్పందిస్తూ నిజంగానే అన్ని మతాలను స మానంగా గౌరవించే సంప్రదాయం ఉంటే మసీదులను తవ్వి ఉర్దూపై నిషేధం విధించాలని బహిరంగ ప్రకటన చేసిన ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్పై ఎందుకు చర్య తీసుకోలేదని కెటిఆర్ ప్రశ్నించారు.
ఈ విషయంలో కూడా బిజెపి అధిష్టానానిది అంతా డబుల్ గేమ్గా కనిపిస్తోందని ధ్వజమెత్తారు. దేశంలో ఏ ఒక్క వర్గం లేదా మతాన్ని అవమానించే భావజాలానికి తాము పూర్తిగా వ్యతిరేకమని ఆ పార్టీ స్పష్టం చేసిందని గుర్తు చేశారు.
అలాంటి వ్యాఖ్యలు చేసే వ్యక్తులను లేదా అభిప్రాయాలు కలిగిన వారిని తమ పార్టీ ప్రోత్సహించదని పేర్కొన్న బిజెపి మరి బండి సంజయ్ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటోందని మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు. ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా బండి సంజయ్ పలుమార్లు వ్యాఖ్యలు చేశారని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు.