బిజెపి పార్టీ నుండి ఆదివారం సాయంత్రం సస్పెండ్ చేసిన ఇద్దరు నేతలు ప్రవక్త మహమ్మద్పై చేసిన వ్యాఖ్యలు గల్ఫ్ దేశాలలో పెను దుమారం రేపుతున్నాయి. గల్ఫ్ దేశాలు భారతీయ దౌత్యవేత్తలను పిలిపించి వరుసగా నిరసనలు తెలుపుతున్నాయి.
ఖతార్, ఇరాన్, కువైట్లతో పాటు సౌదీ అరేబియా ప్రభుత్వాలు భారత రాయబారులను పిలిపించి తమ నిరసనను వ్యక్తం చేశాయి. ఈ నిరసనల తీవ్రతను పసిగట్టిన తర్వాతనే బిజెపి తన జాతీయ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ,ఢిల్లీ మీడియా హెడ్ నవీన్ కుమార్ జిందాల్ లను బహిష్కరించినట్లు తెలుస్తున్నది.
ముస్లిం సమూహాల నిరసన ప్రదర్శనలు, అంతర్జాతీయ సమాజం నుండి తీవ్ర ప్రతిస్పందనలతో బిజెపి అన్ని మతాలను గౌరవిస్తుందని, ఏదైనా మతపరమైన వ్యక్తిని అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేస్తూ బిజెపి ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. కాగా, ఖతార్, కువైట్ దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖలు భారతదేశంలోని అధికార పార్టీ ఈ విషయమై విడుదల చేసిన ప్రకటనను స్వాగతించాయి.
ఇదిలా ఉండగా, భారతీయ ఉత్పత్తులను బహిష్కరించాలని పలు గల్ఫ్ దేశాల్లో సోషల్ మీడియాలో ప్రచారం చేపట్టిన నేపథ్యంలో ఈ దేశాల్లోని పలు సూపర్ మార్కెట్లు భారతీయ వస్తువులను ఉంచడం లేదు. యాదృచ్ఛికంగా, ఇదే సమయంలో ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ప్రస్తుతం ఖతార్లో అధికారిక పర్యటనలో ఉన్నారు. వివాదాస్పద ట్వీట్లు భారత ప్రభుత్వ అభిప్రాయాలను ఏ విధంగానూ ప్రతిబింబించవని ఖతార్లోని భారత రాయబారి ఒక ట్వీట్లో స్పష్టం చేశారు.
“బిజెపిని తెలుసుకోవడం” అనే ప్రచారం ద్వారా బిజెపి అనేక దేశాలకు చేరుకుంటున్న సమయంలో ఈ వివాదం చెలరేగడం భారత ప్రభుత్వంకు కొంత ఇబ్బందికరంగానే ఉంది. బిజెపి జాతీయ కార్యాలయంకు పలు దేశాల రాయబారులను బృందాలవారీగా ఆహ్వానిస్తూ, వారికి బీజేపీ గురించి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా వివరిస్తున్నారు. ఆ విధంగా బిజెపి కార్యాలయానికి వస్తున్న రాయబారులతో పలు గల్ఫ్ దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారు.
గల్ఫ్తో బలమైన ఆర్థిక సంబంధాలు
మరోవంక, పలు గల్ఫ్ దేశాలతో భారత్ కు బలమైన ఆర్ధిక సంబంధాలు ఉన్నాయి. భారత్ అత్యధికంగా విదేశీ వాణిజ్యం జరుపుతున్న ఐదు దేశాలలో అమెరికా, చైనాల తర్వాత మూడు గల్ఫ్ దేశాలే కావడం గమనార్హం. ఈ దేశాలలో సుమారు 65 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. అనేక దేశాలలో విదేశీయులలో భారతీయులే ఎక్కువగా ఉన్నారు.
సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం ప్రకారం, రియాద్లో ప్రధాన కార్యాలయం గల బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఎఇ దేశాలతో కూడిన గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి)లో భారత్ అత్యంత విలువైన భాగస్వామి.
2020-2021లో, జిసిసి దేశాలతో భారతదేశం మొత్తం వాణిజ్య విలువ 87 బిలియన్ల డాలర్లకు పైగా ఉంది, ఇందులో దాదాపు 60 బిలియన్ల డాలర్ల విలువైన దిగుమతులు ఉన్నాయి. 2020-2021లో మొత్తం ద్వైపాక్షిక ద్వైపాక్షిక వాణిజ్యం గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 27 శాతం వృద్ధిని సాధించింది.
2022లో తన మొదటి అంతర్జాతీయ పర్యటనలో ప్రధాని మోడీనరేంద్ర మోదీ జనవరిలో యుఎఇ, కువైట్లను సందర్శించడం ద్వారా భారతదేశానికి ఈ ప్రాంతం ప్రాముఖ్యతను కూడా అంచనా వేయవచ్చు. 2014 నుంచి అనేక సార్లు అనేక దేశాలను సందర్శించిన మోదీ ఈ ప్రాంతానికి నిత్య సందర్శకుడిగా ఉన్నారని చెప్పవచ్చు.
విరుచుకు పడ్డ స్వామి
కాగా,ఆ ఖతార్లోని ఆ దేశ రాయబార కార్యాలయం నుపుర్ శర్మను ‘ఫ్రింజ్ ఎలెమెంట్స్’గా అభివర్ణించడం పట్ల బిజెపి మాజీ రాజ్యసభ సభ్యుడు డా. సుబ్రమణ్యస్వామి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. భారత రాయబారి ప్రకటనను ఎగతాళి చేస్తూ స్వామి ట్వీట్ చేశారు.
పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న సమయంలో నూపూర్ శర్మ పట్ల ఆ విధంగా వ్యాఖ్యానించడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. జైశంకర్ విదేశాంగ మంత్రిగా ఉండటంతో మీరు అంతకన్నా ఏమి ఆశిస్తున్నారు? అని ఎద్దేవా చేశారు. ఖతార్లోని మా రాయబారికి చదవడానికి ఆ టెక్స్ట్ ఎవరు పంపారు? అని ప్రశ్నించారు.
మరోవంక, పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ “బాధకరమైన వ్యాఖ్యలను” ఖండించారు. “మోదీ నేతృత్వంలోని భారతదేశం మత స్వేచ్ఛను తుంగలో తొక్కి, ముస్లింలను హింసిస్తోందని పదే పదే చెబుతున్నా… ప్రపంచం గమనించాలి. భారతదేశాన్ని తీవ్రంగా మందలించాలి” అంటూ ఆయన ట్వీట్ చేశారు.