కాళీ మాతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై కేసు నమోదైంది. ఒక సినిమా పోస్టర్ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఆమెను అరెస్టు చేయాలని బిజెపి నేతలు ఫిర్యాదు చేశారు. ఆ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కోల్కతాలో నిరసన చేపట్టడమే కాకుండా టీఎంసీ నుంచి ఆమెను సస్పెండ్ చేయాలని ఆందోళన చేపట్టారు.
మరోపక్క తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోడానికి మహువా నిరాకరించారు. బెంగాలీలు ఆరాధించే దేవతామూర్తి నిర్భయమైందంటూ ట్వీట్ చేశారు. ‘నేను కూడా కాళీ మాత ఆరాధకురాలినే. మీ గుండాలకు, మీ పోలీసులకు మరో ముఖ్యంగా మీ ట్రోల్స్కు దేనికీ నేను భయపడను. నిజం చెప్పేందుకు ఇతర శక్తుల మద్దతు అవసరం లేదు’ అంటూ గట్టిగా బదులిచ్చారు.
ఈ విషయంలో కాంగ్రెస్ నేత శశిథరూర్ ఆమెకు మద్దతుగా నిలిచారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరికీ తెలిసినవే అయినా ప్రస్తుతం వస్తోన్న విమర్శలు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయని వ్యాఖ్యానించారు. అయితే టిఎంసి తాము ఆమె వ్యాఖ్యలతో ఏకీభవించడం లేదని స్పష్టం చేసింది. అవి ఆమె వ్యక్తిగత వాఖ్యలని పేర్కొన్నది.
దర్శకురాలు, రచయిత్రి నటి లీనా మణిమేగలై తన తాజా చిత్రం కాళీకి సంబంధించి ఇటీవల విడుదల చేసిన పోస్టర్ తీవ్ర వివాదాస్పదంగా మారింది. దానిపై మంగళవారం ఒక చర్చా కార్యక్రమంలో అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించిన తీరుకు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. స్వంత పార్టీ కూడా ఆమె మాటలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. తన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం కావడంతో మహువా స్పందిస్తూ తాను ఏ చిత్రానికి, ఏ పోస్టర్కు మద్దతు ఇవ్వలేదని పేర్కొన్నారు. తాను ధూమపానం అనే పదాన్ని వాడలేదని, వివరణ ఇచ్చారు.
”నేను ఏ చిత్రానికి, పోస్టర్కు మద్దతుగా ధూమపానం అనే పదాన్ని ప్రస్తావించలేదు. ప్రసాదంగా ఎలాంటి ఆహారం, పానీయాలు సమర్పిస్తారో చూసేందుకు కోల్కతాలోని తారాపీఠ్ కాళీమాత ఆలయాన్ని సందర్శించాలని సూచించాను” అని తెలిపారు.
”నేను కాళీ భక్తురాలినని దేనికీ భయపడను. మీ అవివేకానికి, మీ గూండాలకు, మీ ట్రోల్స్కు, చివరికి బిజెపి వచ్చినా భయపడేది లేదు. సత్యానికి వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరంలేదు” అని ట్వీట్చేశారు. ఈ పరిణామాల మధ్యనే ఆమె టిఎంసి అధికారిక ట్విటర్ ఖాతాను అన్ఫాలో చేయడం చర్చనీయాంశంగా మారింది.