నరేంద్ర మోదీ మంత్రివర్గంలోని ఏకైక ముస్లిం మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ బుధవారం తన మంత్రిపదవికి రాజీనామా చేయడంతో ప్రస్తుతం జరుగుతున్న ఉప రాష్ట్రపతి ఎన్నికలలో ఆయననే తమ అభ్యర్థిగా బిజెపి ప్రకటించవచ్చని పలువురు భావిస్తున్నారు.
నఖ్వీతో పాటు మరో మంత్రి ఆర్సిపి సింగ్ (జెడియు) కూడా మంత్రి పదవుల నుంచి తప్పుకున్నారు. వీరిద్దరి రాజ్యసభ పదవి కాలం గురువారంతో ముగియనుంది.
బుధవారం ఉదయం నఖ్వీ ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి.నడ్డాలతో సమావేశం కావడంతో ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో ఎన్డిఎ అభ్యర్థిగా ఆయనను నిలబెట్టే అవకాశాలున్నట్లు వస్తున్న వార్తలకు మరింత బలం చేకూర్చినట్లయింది. అ
బ్బాస్ నఖ్వీ, రాజ్నాథ్ సింగ్లు మాత్రమే వాజ్పేయి ప్రభుత్వం నుండి ప్రధాని మోదీప్రభుత్వంలోనూ మంత్రులుగా కొనసాగుతున్నారు.
ఇటీవల బిజెపి మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలతో మైనార్టీ వర్గంలో, ముఖ్యంగా భారత్ కు మంచి వాణిజ్య సంబంధాలున్న గుల్జ్ దేశాలలో కొంత ప్రతికూలత ఏర్పడినట్లు భావిస్తున్నారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మైనార్టీ నేతకు ఉపరాష్ట్రపతి పదవి కట్టబెట్టాలని ఎన్డీఏ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రెండో అతిపెద్ద రాజ్యాంగ పదవికి ముస్లింను ఎంపిక చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డిఎ అభ్యర్థి రేసులో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, మాజీ కేంద్ర మంత్రి నజ్మా హెప్తుల్లా పేర్లు కూడా వినిపిస్తున్నాయి.ఆగస్టు 6న ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి.
కాగా, వీరిద్దరూ నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖలను మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ, పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాలకు కేంద్రం అదనపు బాధ్యతలు అప్పగించారు. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బాధ్యతలను స్మృతి ఇరానీకి, స్టీల్ శాఖను జ్యోతిరాధిత్య సింధియాకు అప్పగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.