బ్రిటన్లో బోరిస్ జాన్సన్ ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రధాని జాన్సన్పై విశ్వాసం కోల్పోయామని చెబుతూ మంగళవారం ఇద్దరు సీనియర్ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయగా, బుధవారం మరో ఐదుగురు మంత్రులు కూడా రాజీనామా చేశారు.
మంత్రులు కెమి బాడెనోచ్, నీల్ ఓ’బ్రియన్, అలెక్స్ బర్గార్ట్, లీ రౌలీ, జూలియా లోపెజ్లు బుధవారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి బోరిస్ జాన్సన్ను ఉన్నత పదవిలో కూర్చోబెట్టారని షాకింగ్ కామెంట్స్ చేశారు. తమకు రాజీనామా తప్ప మరో మార్గం లేదని లేఖలో స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే బోరిస్ జాన్సన్ ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయినందుకే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం ఆర్థిక మంత్రి రిషి సునాక్, ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
అనంతరం, తదుపరి ప్రధానిగా భావిస్తున్న భారత మూలాలు గల రిషి సునాక్ మాట్లాడుతూ “మన దేశం కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రభుత్వం సజావుగా, సమర్థంగా, సీరియస్గా పని చేయాలని ప్రజలు ఆశిస్తారు. ఆ ప్రమాణాలు లోపించాయి గనుకనే తప్పుకుంటున్నా. చాలా సందర్భాల్లో మీ(బోరిస్ జాన్సన్) వైఖరిని వ్యక్తిగతంగా ప్రశ్నించినా ప్రజాప్రయోజనాల దృష్ట్యా అందరి ముందూ మాత్రం సమర్థించాను” అంటూ కుండబద్దలు కొట్టారు.
2019లో ప్రధాని జాన్సన్ క్రిస్ పించర్ను ప్రభుత్వ డిప్యూటీ చీఫ్ విప్గా నియమించారు. అప్పటికే అతనిపై పలు ఆరోపణలు ఉన్నాయి. క్రిస్పై లైంగిక వేధింపుల ఆరోపణలే కాకుండా, ఇటీవల ఒక క్లబ్లో తాగిన మత్తులో క్రిస్ పించర్ ఇద్దరు పురుషుల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం తీవ్ర వివాదానికి దారి తీసింది.
ఆ విషయాన్ని ప్రభుత్వాధికారులు చెప్పినా జాన్సన్ పట్టించుకోకుండా క్రిస్ పించర్ను కీలకమైన పదవిలో కూర్చోబెట్టారు. దీంతో, జాన్సన్ తీరుపై తీవ్ర వ్యాఖ్యలతో మంత్రుల రాజీనామా ప్రకటనలు వెలువడ్డాయి. అనంతరం.. తాను చేసింది పొరపాటేనంటూ జాన్సన్ ప్రకటన చేశారు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో, మరోసారి బోరిస్ ప్రభుత్వం ప్రమాదం పడింది. ఇటీవలే అవిశ్వాస తీర్మాణం నుంచి గట్టెక్కిన బోరిస్ సర్కార్కు ఇలా మరో ఎదురుదెబ్బ తగిలింది.