వాతావరణ మార్పు వాతావరణం అంచనావేసే సామర్థాన్ని దెబ్బతీస్తున్నది. వాతావరణ సంస్థలు ముందస్తుగా, ఖచ్చితంగా అంచనా వేయడంలో వెనుకబడుతున్నాయని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. ఇటీవలి కాలంలో దేశంలోని కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడం, విడవకుండా ఒకేచోట మబ్బులు దట్టంగా అలుముకుని రోజుల తరబడి వర్షాలు కురియడం వంటి పరిణామాలు అంచనాలకు అందనివి అని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు వాతావరణ సంస్థల అంచనాల పరిధికి అందని విధంగా వాతావరణంలో మార్పులు నెలకొంటున్నాయని భావించాల్సి వస్తోందని తెలిపారు. దేశంలో ఈసారి రుతుపవనాలు ఆగమనం, వర్షాలు కురిసే తేదీల విషయంలో ఐఎండి అంచనాలు విశ్లేషణలు దాదాపుగా సరయ్యాయి. అయితే భారీ వర్షాల విషయంలో ముందస్తు అంచనాలు కుదరలేదని పేర్కొన్నారు. ఇది వాతావరణంలో అంతర్గతంగా నెలకొంటున్న మౌలికమైన మార్పుల ప్రక్రియ ఫలితం అని చెప్పారు.
ఇప్పటి పరిణామంతో పలు దేశాల వాతావరణ కేంద్రాలు తమ పరిశీలనా వ్యవస్థలను మరితగా విస్తృతపర్చుకుని తీరాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. 1901 నుంచి ఇప్పటివరకూ నమోదు అయిన వర్షాల డిజిటల్ డేటా తమ కేంద్రం వద్ద అందుబాటులో ఉంది. ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య భారతం వంటి చోట్ల ఇంతకు ముందటితో పోలిస్తే తక్కువ వర్షపాతం నమోదు అయింది.
అయితే పశ్చిమ ప్రాంతం అంటే రాజస్థాన్ పశ్చిమ ప్రాంతం ఇతర చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయని వివరించారు. ఇది తాము ఊహించలేదని, తమ సంస్థ పర్యవేక్షక వ్యవస్థ పరిధిలోకి రాలేదని వివరించారు. ఖచ్చితమైన అంచనాలు వేసేందుకు వాతావరణ శాఖ మరిన్ని రాడార్లను ఏర్పాటు చేస్తోంది.
అంతేకాక బాగా పనిచేసే కంప్యూటింగ్ వ్యవస్థను అప్గ్రేడ్చేస్తోందని ఆయన చెప్పారు. ‘మాన్సూన్ వానలు గణనీయమైన ట్రెండ్ను చూపకపోయినప్పటికీ, వానలు బాగానే పడ్డాయి. అలాగే వాతావరణ మార్పు కారణంగా కొన్ని చోట్ల వానలు తగ్గిపోయాయి’ అని ఆయన తెలిపారు.
ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్కాస్ట్ 2025 నాటికి మెరుగుపడుతుందని, అప్పుడు మరింత గ్రాన్యలర్, స్పెసిఫిక్, ఖచ్చితమైన అంచనాలు అందుతాయని ఆయన వివరించారు. 1970 నుంచి వర్షపాతం డేటాను రోజువారిగా విశ్లేషిస్తున్నామని, అది భారీ వానలు పెరిగాయని, సాధారణ వానలు తగ్గాయని చూపుతోందని పేర్కొన్నారు.
‘దీనర్థం ఏమిటంటే వానలు పడకపోతే అసలు పడవు, పడితే విపరీతంగా పడుతున్నాయి. అల్పపీడనం ఏర్పడినప్పుడు వానలు తీవ్రస్థాయిలో పడుతున్నాయి’ అని చెప్పారు. వాతావరణ మార్పు ఉపరితల ఉష్ణోగ్రతను పెంచేసిందని పేర్కొన్నారు. తద్వారా ఆవిరి రేటు పెరిగిపోయిందన్నారు. వేడి గాలి మరింత తేమను గ్రహిస్తుంది, కనుక దాని ఫలితంగా తీవ్ర వానలు పడుతుంటాయి’ అని ఆయన వివరించారు.