నేతాజీ సుభాష్ చంద్రబోస్ చూపిన బాటలో నడిచి ఉంటే.. దేశం ఉన్నత శిఖరాలను చేరి ఉండేదని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తు ఆయనను మరిచిపోయారని విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు అనేక సౌలతులతో తీర్చిదిద్దిన ‘కర్తవ్యపథ్’ రోడ్డును, సెంట్రల్ విస్టా లాన్స్ను గురువారం సాయంత్రం ప్రధాని ప్రారంభించారు.
ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేసిన 28 అడుగుల నేతాజీ విగ్రహాన్ని కూడా మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్తవ్యపథ్కు ఇంతకుముందున్న రాజ్ పథ్ అనే పేరు బ్రిటీష్ కాలం నాటి బానిసత్వానికి సంకేతంగా ఉండేదని పేర్కొన్నారు. రాజ్ పథ్ పేరును కర్తవ్యపథ్గా మార్చడంతో దేశానికి కొత్త శక్తి, స్ఫూర్తి వచ్చాయని చెప్పారు.
‘‘ఇయ్యాల్టి నుంచి రాజ్ పథ్ అనే పేరు చరిత్రగా మారింది. కర్తవ్యపథ్తో కొత్త చరిత్ర మొదలైంది. ఇయ్యాల కర్తవ్యపథ్ ఆర్కిటెక్చర్, స్ఫూర్తి మారిపోయాయి. ఈ మార్గంలో మంత్రులు, అధికారులు వెళ్తుంటే.. ఇకపై వారి కర్తవ్యాన్ని ఇది గుర్తు చేస్తుంది” అని ప్రధాని భరోసా వ్యక్తం చేశారు.
సెంట్రల్ విస్టా అవెన్యూ రీడెవలప్మెంట్లో పాల్గొన్న కార్మికులను రిపబ్లిక్ డే వేడుకలకు అతిధులుగా పిలుస్తామని వెల్లడించాయిరు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, హర్దీప్ సింగ్ పురి, జి.కిషన్రెడ్డి, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తదితరులు పాల్గొన్నారు. కాగా, నేతాజీ విగ్రహాన్ని ఖమ్మం నుంచి తెచ్చిన 280 టన్నుల బరువున్న ఏకశిలా గ్రానైట్ బ్లాక్ నుంచి చెక్కారు.
కాగా, రాజ్పథ్ పేరును కర్తవ్య పథ్గా మార్చడాన్ని స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లయిన సందర్భంగా దేశాన్ని వలసవాద భావనలనుంచి విముక్తి చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపులో భాగమేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో ప్రధాని దేశంలో బ్రిటీష్ వలస పాలన నాటి చిహ్నాలను తుడిచి వేయాలన్నది తన ఉద్దేశమని ప్రకటించిన విషయం తెలిసిందే. మోడీ అధికారంలోకి వచ్చిన గత ఎనిమిదేళ్ల కాలంలో ఈ దిశగా కేంద్రం అనేక చర్యలు తీసుకుంది.
ప్రధాని చేస్తున్న నిరంతర కషిలో భాగమే రాజ్పథ్ పేరును ‘కర్తవ్య పథ్’గా మార్చడమని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ సందర్భంగా ప్రధాని తీసుకున్న ఐదు ప్రతినల్లో భాగంగా చేపట్టిన పలు చర్యలను కూడాఆ నోట్లో వివరించింది.
సెంట్రల్ విస్టాను చూసేందుకు వచ్చే సందర్శకుల కోసం ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఢిల్లీ మెట్రో వెల్లడించింది. శుక్రవారం నుంచి వారం పాటు సాయంత్రం 5 నుంచి 9 వరకు 12 ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతామని చెప్పింది. ఇవి భైరాన్ రోడ్, రాజ్ ఘాట్, కన్నాట్ ప్లేస్, జేఎల్ఎన్ స్టేడియం నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపింది.
ఇక ‘కర్తవ్య పథ్’ చుట్టూ ఢిల్లీ పోలీసు సిబ్బందితో పాటు 80 మందికి పైగా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులతో భారీ భద్రత ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ భద్రత, రెండు నెలల పాటు ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రపతి భవన్, ఇండియా గేట్ మధ్య కొత్తగా ఏర్పాటు చేసిన సౌలతులకు ఎలాంటి నష్టం జరగకుండా భద్రతా సిబ్బంది నిఘా పెడతారని చెప్పారు. సందర్శకులకు మాత్రం ఆంక్షలు ఉండవని స్పష్టం చేశారు.