ఢిల్లీలో బౌద్ధ మత కార్యక్రమంలో మతమార్పిడి ప్రమాణం వంటి విషయాలు వివాదానికి కారణమయ్యాయి. ఢిల్లీ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ ఆదివారం అరవింద్ కేజ్రీవాల్ మంత్రివర్గం నుండి రాజీనామా చేశారు.
రాజేంద్ర పాల్ గౌతమ్ ఒక మత మార్పిడి కార్యక్రమంలో హిందూ దేవతలను దూషించినట్లు దేశ రాజధానిలో జరిగిన ఈవెంట్కి సంబంధించిన వీడియో ఒకటి వైరల్గా మారింది. దీంతో పలువురు బీజేపీ లీడర్లు, ప్రజాప్రతినిధులు దీనిపై విమర్శలకు దిగారు. ఈ విషయంపై ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కూడా వారు వదిలిపెట్టలేదు.
ఇది హిందూ, బౌద్ధమతాలను అవమానించడమేనని, ఆప్ మంత్రులు అల్లర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ విమర్శలు చేశారు. ఆ మంత్రిని వెంటనే పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
కాగా, వైరల్ అయిన వీడియోలో గౌతమ్తో పాటు వందలాది మంది ప్రమాణం చేయడం కనిపించింది. ఉద్దేశ్యపూర్వకంగా మైక్రోఫోన్లో ఉన్న వ్యక్తి ప్రమాణం ఇలా చెబుతూ ఉంటాడు.. ‘మేము బ్రహ్మ, విష్ణు, మహేశ్, గౌరీ-గణేష్లను దేవుళ్లుగా విశ్వసించము. వారిని ఎప్పుడూ ప్రార్థించము. నేను రాముడిని, కృష్ణుడిని దేవుళ్లుగా పరిగణించను.. ఎప్పటికీ గౌరీ గణపతి మొదలైనవాటిని లేదా మరే ఇతర హిందూ మత దేవుళ్లు, దేవతలను నేను ప్రార్థించను’ అని ఆ వీడియోలో ఉంది.
‘మిషన్ జై భీమ్’ బ్యానర్పై అక్టోబర్ 5న ఢిల్లీలో ‘ఘర్ వాప్సీ ఇన్ బౌద్ధిజం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ వీడియోని మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ తన ఫేస్బుక్ పేజీలో షేర్ చేయడం మరింత ఆందోళనకు కారణమయ్యింది.
అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధమతంలోకి మారినప్పుడు అదే ప్రమాణం చేశారని ఆప్ మంత్రి పేర్కొన్నారు తాము అదే ప్రతిజ్ఞను పునరావృతం చేశామని, 1956 అక్టోబరు 14న బాబా సాహెబ్ బౌద్ధమతాన్ని స్వీకరించినప్పుడు ఆయన 22 ప్రమాణాలు చేశాడని చెప్పుకొచ్చారు. తాము కూడా ఇదే తరహా ప్రమాణం చేశామన్నారు. ఇక.. తమ పూర్తి వీడియో చూడాలని, బీజేపీ తన స్వలాభం కోసం ఆ వీడియోని కట్ చేసి షేర్ చేస్తోందని మండిపడ్డారు.