అయ్యప్ప స్వామి భక్తులు కేరళలోని శబరిమల క్షేత్రాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు. ప్రతి ఏడాది ఈ క్షేత్రంలో రెండు నెలల పాటు ‘మండలం మకరవిళక్కు’ పండుగ వైభవంగా జరుగుతుంది. ఈ ఏడాది మరో రెండు రోజుల్లో ఈ పండుగ ప్రారంభం కానుంది. దాంతో, ఆలయ పరిసరాలను నవంబర్ 14 నుంచి వచ్చే ఏడాది జనవరి 22వ తేదీ వరకు ‘లిక్కర్, డ్రగ్స్ ఫ్రీ జోన్’గా కేరళ ప్రభుత్వం ప్రకటించింది.
శబరిమలలోని వ్యాపారులు, శబరిమలకు వచ్చే భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని అధికారులు తెలిపారు. అంతేకాదు మందు, డ్రగ్స్, పొగాకుపై విధించిన నిషేధాన్ని ఎవరూ ఉల్లంఘించకుండా చర్యలు తీసుకోనున్నారు. అందులో భాగంగా పోలీసులు, ఎక్సైజ్ శాఖ, అటవీ శాఖ అధికారుల బృందం ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించనున్నారు.
ఆలయ పరిసరాల్లో ‘ఇక్కడ మద్యం, డ్రగ్స్, పొగాకు వంటివి నిషేధం’ అని పలు భాషల్లో రాసున్న బోర్డులని అధికారులు చాలా చోట్ల ఏర్పాటు చేశారు. శబరిమల ఆలయ పరిసరాలతో పాటు పంబ, త్రివేణి, మరకూట్టం, శబరి పీడంతో పాటు పెరినాడు, కొల్లాములా గ్రామాల్లో కూడా ఈ నిషేధం వర్తించనుంది.
‘మండలం మకరవిళక్కు’ వేడుకని చూసేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా లక్షలాదిమంది భక్తులు శబరిమల యాత్రకు వెళ్తారు. రెండు నెలల పాటు జరిగే ఈ పండుగ వచ్చే 2023 జనవరి 15వ తేదీన ముగుస్తుంది.
కాగా, సికింద్రాబాద్ నుంచి శబమరి వెళ్లే భక్తుల కోసం 26 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ – కొల్లం స్టేషన్ల మధ్యలో ఈ నెల 20 నుంచి ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయని తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 17 వరకు శబరిమలకు ఈ రైళ్లు రాకపోకలు కొనసాగించనున్నాయి. మొత్తంగా ఎనిమిది సర్వీసులుగా వీటిని కేటాయించారు.