హిమాచల్ ప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సుఖ్విందర్ సింగ్ సుఖు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా ముఖేశ్ అగ్నిహోత్రి ప్రమాణ స్వీకారం చేశారు.
సిమ్లాలోని రిడ్జి మైదానంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్, సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడా, రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్, హిమాచల్ ప్రదేశ్ పీసీసీ చీఫ్ ప్రతిభా వీరభద్రసింగ్ విచ్చేశారు.
కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సుఖ్విందర్ సింగ్ సుఖు నడావ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి విజయ్ కుమార్ పై 3వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఇప్పటి వరకు మొత్తం ఐదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సుఖ్విందర్ సింగ్ సుఖు నాలుగు సార్లు శాసనసభ్యుడిగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టాడు.
2003 తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన సుఖు రెండోసారి 2007 లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే తర్వాత 2012, 2017, 2022 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు గెలిచారు. 2013 నుంచి 2019 వరకు పీసీసీ చీఫ్ హోదాలో ఉన్నారు. 1998 నుంచి 2008 వరకు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు.
ఇటీవల జరిగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 68 స్థానాలకుగాను కాంగ్రెస్ పార్టీ 40 స్థానాలను గెలుచుకుంది.