దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలకంగా మారిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐ విచారణ ఆదివారం ముగిసింది. ముందే చెప్పిన విధంగా ఉదయం పదకొండు గంటలకే వచ్చిన అధికారులు.. సుదీర్ఘంగా విచారణ చేశారు. సుమారు ఏడున్నర గంటల పాటు కవితపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు.
పదకొండు గంటలకు వచ్చిన అధికారులు విచారణ మొదలు పెట్టగా.. ఆరున్నర వరకు ఈ విచారణ సాగింది. కవిత ఇంట్లో ప్రత్యేక గదిలో.. ఆమె అడ్వకేట్ ఆధ్వర్యంలోనే విచారణ సాగింది. ఈ కేసుకు సంబంధించిన పలు కీలక అంశాలను కవిత నుంచి తెలుసుకున్నారు. ఈ కేసులో అధికారులకు ఉన్న సందేహాలను సంధించిన అధికారులు . ఆమె ఇచ్చిన సమాధానాలను రికార్డు చేసుకున్నారు.
లిక్కర్ కేసు నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే సీబీఐ అధికారులు విచారించింది. అమిత్ అరోరా ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అధికారులు కవితను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సిసోడియా, అరోరా, అభిషేక్ విషయంలో అధికారులకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకునే నేపథ్యంలో ఎక్కువగా సీబీఐ ప్రశ్నించినట్లు తెలిసింది.
మరోవైపు.. 170 సెల్ఫోన్లు ధ్వంసం చేశారనే ఆరోపణలపై సీబీఐ స్పష్టత తీసుకున్నట్టు సమాచారం. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ కవిత పేరు ప్రస్తావించిన తర్వాత.. కవితకు సీబీఐ నోటీసు ఇచ్చింది. నిందితులైన బోయినపల్లి అభిషేక్ రావు, అరుణ్ రామచంద్ర పిళ్లై, ఇండో స్పిరిట్ ఎండీ సమీర్ మహేంద్రు స్టేట్మెంట్ ఆధారంగా కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.