కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై సోమవారం తెలంగాణ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. మాస్టర్ ప్లాన్ నిర్ణయాన్ని హోల్డ్ లో పెట్టినట్లు తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. రైతుల ఆందోళనల నేపథ్యంలో ప్రస్తుతం ఈ ప్లాన్ ను పక్కన పెట్టినట్లు వివరించింది.
దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని, అవసరమైతే ముందుగా కోర్టుకు తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టుకు తెలియకుండా మాస్టర్ ప్లాన్ విషయంలో ముందుకెళ్లొద్దని సూచించింది. అదేవిధంగా సింగిల్ బెంచ్ లో ఉన్న మరో పిటిషన్ ను హైకోర్టు డివిజన్ బెంచ్ లో ఇంప్లీడ్ చేసింది.
మాస్టర్ ప్లాన్ పై దాఖలైన పిటిషన్ లో ఇంప్లీడ్ పర్సన్ గా డివిజన్ బెంచ్ ముందు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వాదనలు వినిపించారు. కాగా, కామారెడ్డి మునిసిపాలిటీ అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ను రూపొందించింది. అయితే, పంట భూములను ఇండస్ట్రియల్, గ్రీన్ జోన్లుగా గుర్తించారని రైతులు ఆందోళన చేస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయంతో తన భూమి విలువ పడిపోతుందనే ఆవేదనతో పయ్యావుల రాములు అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన తీవ్రరూపం దాల్చింది.
మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలన్న డిమాండ్ కు ప్రతిపక్షాలు మద్దతు తెలిపాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అధికార పార్టీ నేతల భూముల విలువ పెంచేందుకే మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేశారని ఆరోపించాయి. మాస్టర్ ప్లాన్పై బాధిత రైతులు హైకోర్టును కూడా ఆశ్రయించారు.