జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో జగిత్యాల పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి అంజన్న వెండి విగ్రహం సహా మొత్తం 5 కిలోల వెండి విగ్రహాలను స్వాధీనం చేసుకున్నామని జగిత్యాల ఎస్పీ భాస్కర్ తెలిపారు. కర్ణాటక రాష్ట్రం బీదర్ కు చెందిన అంతర్రాష్ట్ర ముఠా కొండగట్టు ఆలయంలో చోరీకి పాల్పడిందని వెల్లడించారు.
మొత్తం ఏడుగురు సభ్యులతో కూడిన ముఠా..చోరీకి ప్లాన్ చేసిందని..ప్రస్తుతం ముగ్గురిని అరెస్ట్ చేశామని, పరారీలో ఉన్న మరో నలుగురి కోసం 4 పోలీసు బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. ఫిబ్రవరి 23న రాత్రి ఒంటి గంట సమయంలో నలుగురు దొంగలు అంజన్న ఆలయంలో చొరబడి గర్భాలయంలో ఉన్న సుమారు రూ.9 లక్షల విలువ చేసే 15 కిలోల వెండి సామాగ్రిని దొంగిలించుకుపోయారు.
24న తెల్లవారుజామున స్వామి వారికి పూజలు నిర్వహించేందుకు వెళ్లిన అర్చకులు, ఆలయ అధికారులు దొంగతనం జరిగినట్లు గుర్తించి తమకు ఫిర్యాదు చేశారన్నారు. వెంటనే క్లూస్ టీం, డాగ్ స్కాడ్ను రంగంలోకి దింపి అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేసినట్లు ఎస్పి వివరించారు. 10 పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కేవలం 24 గంటల్లోనే దొంగల కదలికలను గుర్తించి ముగ్గురు దొంగలను అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి వద్ద నుంచి 5 కిలోల వెండి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
మొత్తం 15 కిలోల వెండి సామాగ్రి చోరికి గురి కాగా, పట్టుబడ్డ దొంగల నుంచి వెండి శఠగోపం, వెండి గొడుగు, వెండి పెద్ద రామరక్ష, రెండు ద్వారాలకు అమర్చిన కవచం ముక్కలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పట్టుబడ్డ సామాగ్రి 5 కిలోలు ఉండగా వాటి విలువ రూ. 3.50 లక్షల ఉంటుందని తెలిపారు.
మరో 10 కిలోల వెండి మకరతోరణం, స్వామి వారి కిరీటం, శఠగోపాలు, అంజనేయ స్వామి వెండి ప్రతిమ స్వాధీనం చేసుకోవాల్సి ఉందని వివరించారు.
ఈ దొంగల ముఠా ఆలయాలను టార్గెట్ చేసి చోరికి పాల్పడటంలో దిట్ట అని, వీరి మీద మహరాష్ట్రలోని పండరీపురంలోని ఆలయంలో చోరికి పాల్పడ్డ కేసు నమోదైందని, అలాగే కర్ణాటక రాష్ట్రంలోని కమాన్పూర్లో, తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా చాముండేశ్వరి ఆలయంలో చోరికి పాల్పడ్డ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.