దగ్గు, జలుబు, వికారం వంటి చిన్నపాటి అస్వస్థతలకు అజిత్రోమైసిన్, అమోక్సిక్లా వంటి యాంటీబయాటిక్స్ను విచక్షణారహితంగా వాడరాదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) హెచ్చరించింది. దేశవ్యాప్తంగా ఈ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐఎంఎ హెచ్చరికలు జారీ చేసింది.
కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా నిరంతర దగ్గు, కొన్ని సందర్భాల్లో జ్వరం, ఒళ్లు నొప్పుతో కూడిన దగ్గు కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇవన్నీ సీజనల్గా వచ్చేనని, కాకపోతే వీటిలో కొన్ని కేసులకు ‘ఇన్ఫ్లుయెంజా ఏ’ ఉప రకం ‘హెచ్3ఎన్2’ వైరస్ కారణమవుతోందని ఐఎంఎ పేర్కొంది.
ప్రస్తుతం వస్తున్న దగ్గులకు హెచ్2 ఎన్2 కారణమవుతోందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్) నిపుణులు కూడా వెల్లడించారు. గత రెండు, మూడు నెలలుగా ఇది విస్తతంగా వ్యాప్తిలో ఉందని తెలిపారు. ఇతర సబ్టైప్లతో పోల్చితే ఇది ఎక్కువగా ఆసుపత్రిలో చేరికలకు కారణమవుతోందని చెప్పారు.
‘ఈ ఇన్ఫెక్షన్ ప్రభావం సాధారణంగా అయిదు నుంచి వారం రోజుల వరకు ఉంటుంది. మూడు రోజుల్లో జ్వరం తగ్గిపోతుంది. దగ్గు మూడు వారాల వరకు ఉంటుంది. 15 ఏళ్లలోపు, 50 ఏళ్లు పైబడిన వారు ఇన్ఫెక్షన్కు గురయ్యే అవకాశాలు ఎక్కువ. వాయు కాలుష్యం కూడా కేసుల పెరుగుదలకు కారణమవుతోంది’ అని ఐఎంఐ తెలిపింది.
ఈ ఇన్ఫెక్షన్లతో బాధపడుతోన్న రోగులకు యాంటీబయాటిక్స్ కాకుండా రోగ లక్షణాలకు మాత్రమే చికిత్స అందించాలని వైద్యులకు సూచించింది. ‘ప్రస్తుతం ప్రజలు అజిత్రోమైసిన్, అమోక్సిక్లావ్ వంటి యాంటీబయాటిక్స్ను విచక్షణారహితంగా వాడుతున్నారు. ఇది యాంటీబయాటిక్స్ నిరోధకతకు దారి తీస్తుంది. కాబట్టి, వాటి వాడకాన్ని నిలిపేయాలి. లేనిపక్షంలో, అవసరమైన సందర్భాల్లో అవి పనిచేయకుండా పోయే తీవ్ర ప్రమాదం ఉంది’ అని ఐఎంఎ హెచ్చరించింది.
డయేరియా, మూత్రనాళ ఇన్ఫెక్షన్ల చికిత్సకు ఉపయోగించే అమోక్సిసిలిన్, నార్ఫ్లోక్సాసిన్, ఒప్రోఫ్లోక్సాసిన్, ఆఫ్లోక్సాసిన్, లెవోఫ్లోక్సాసిన్ వంటి యాంటీబయాటిక్స్లను విపరీతంగా వాడుతున్నారని తెలిపింది. ‘కొవిడ్ సమయంలో అజిత్రోమైసిన్, ఐవర్మెక్టిన్లను విస్తతంగా వినియోగించారు. ఇది కాస్త.. యాంటీబయాటిక్ నిరోధకతకు దారితీసింది. ఈ నేపథ్యంలో రోగులకు యాంటీబయాటిక్స్ సూచించే ముందు.. అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా? కాదా? అని నిర్ధారించుకోవడం అవసరం’ అని ఐఎంఎ తెలిపింది.