నదుల అనుసంధాన ప్రక్రియకు తెలుగు రాష్ట్రాలు సూత్రప్రాయ అంగీకారం తెలిపాయి. సోమవారం హైదరాబాద్ జలసౌధలో జాతీయ జల అభివృద్ధి సంస్థ నదుల అనుసంధానంపై 17వ టాస్క్ఫోర్స్ స మావేశం నిర్వహించింది. ఎన్డ బ్లూడిఎ చైర్మన్ భోపాల్ సింగ్ అ ధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భాగస్వామ్య రాష్ట్రాల అధికారులతో కేంద్ర జల వనరుల శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ కూడా పాల్గొన్నారు.
దేశంలో ప్రధాన నదుల అనుసంధానంపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నదులు అనుసంధాన ప్ర క్రియపై లేవనెత్తిన పలు సందేహాలకు సమావేశంలో స్పష్టతనిచ్చారు. తొలి కింద గోదావరి కృష్ణా పెన్నా కావేరి నదుల అనుసంధానంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
గోదావరి నదిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉన్న నీటి చుక్కా నీటిని కూడా నదుల అనుసంధానం ప్రాజెక్టు కోసం వినియోగించుకోబోమని ఎన్డబ్లూడిఎ నుంచి గట్టి హామీ లభించింది. చత్తీస్గఢ్ రాష్ట్రానికి కేటాయించిన నీటిలో ఆ రాష్ట్రం అధిక శాతం నీటిని ఉపయోగించుకోలేకపోవడంతో ఆ నీరంతా వృథాగా పోతోందని సమావేశంలో ఎన్డబ్లూడిఎ చైర్మన్ బోపాల్సింగ్ వివరణ ఇచ్చారు.
చత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉపయోగించుకోకుండా మిగిలిపోతున్న 141టిఎంసిలను మాత్రమే తొలిదశ కింద గోదావరి కావేరి నదుల అనుసంధాన పథకంలో ఉపయోగించనున్నట్టు తెలిపారు.
గోదావరి నదిలో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన 980 టిఎంసిల నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పలు ప్రాజెక్టుల డిపిఆర్లకు కేంద్ర జల సంఘం నుంచి అనుమతి ఇప్పించాలని తెలంగాణ రాష్ట్రం కోరగా, అందుకు కేంద్ర జల వనరుల శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ సిడబ్లూసితో చర్చించి ప్రాజెక్టుల అనుమతులకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన కరువు ప్రాంతాలకు సాగునీటిని అందించటంలో ప్రాధాన్యత ఇవ్వాలని, నదుల అనుసంధానం ప్రాజెక్టులో వినియోగించే నీటిలో 50 శాతం నీటిని తెలంగాణకు కేటాయించాలని కోరగా, ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
గోదావరి-కావేరి నదల అనుసంధానం కోసం ఇన్టేక్ పాయింట్ ఇచ్చంపల్లి వద్ద ఎంపిక చేస్తే ఎగువన మేడిగడ్డకు, దిగువన సమ్మక్క బ్యారేజీకి సమస్యలు వస్తాయన్న సందేహాలను కూడా తెలంగాణ ప్రభుత్వం సమావేశం ముందు పెట్టింది. సాంకేతికంగా సమగ్ర అధ్యయనం చేసిన తరువాతే, ఉన్న ప్రాజెక్టులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇన్టేక్ పాయింట్ను ఎంపిక చేస్తామని ఎన్డబ్లూడిఎ హామీ ఇచ్చింది.
గోదావరికావేరి నదుల అనుసంధానం తొలిదశ పథకానికి రూ.43వేలకోట్లు వ్యయం అవుతుందని ప్రాధమిక అంచనా వేసినట్టు ఎన్డబ్లూడిఎ వెల్లడించింది. ఈ నిధుల్లో కేంద్ర ప్రభుత్వం 90శాతం భరిస్తుందని 10శాతం ఆయా రాష్ట్రాలు భరించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ సమావేశంలో రాజస్థాన్ , మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఉపయోగపడే పర్బతిచంబల్ నదుల అనుసంధానంపై కూడా చర్చించారు.
వీటికి సంబంధించిన డిపిఆర్ ప్రతులను ఆయా రా్రష్ట్రాలకు అందజేసి టాస్క్ఫోర్స్ సమావేశంలో అభిప్రాయాలు సేకరించారు. ఈ సమావేశంలో తెలంగాణ నుంచి ఇఎన్సి మురళీధర్, ఎపి నుంచి ఇఎన్సి నారాయణరెడ్డితో పాటు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రా్రష్ట్రాల అధికారులు పాల్గొన్నారు.