దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించేందుకు తమ బలగాలను ఉక్కుసైన్యంగా తీర్చిదిద్దుతామని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వెల్లడించాయిరు. అంతర్జాతీయ వ్యవహారాలతోపాటు ప్రపంచ పాలనా వ్యవస్థ సంస్కరణలు, అభివృద్ధిలో చైనా క్రియాశీల పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు.
దేశాధినేతగా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిన్పింగ్ మొదటిసారి ప్రసంగించారు. 2050 నాటికి చైనాను ఒక గొప్ప ఆధునిక సామ్యవాద దేశంగా నిర్మించే , జాతీయ పునరుజ్జీవనాన్ని ముందుకు తీసుకువెళ్లే బాధ్యత మనపై ఉందని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
చైనా పార్లమెంట్ సమావేశాల ముగింపు సందర్భంగా జిన్పింగ్ ఈ మేరకు మాట్లాడారు. “దేశాభివృద్ధికి భద్రతే పునాది, సుసంపన్నతకు స్థిరత్వం అవసరం. ఈ క్రమం లోనే చైనా సాయుధ బలగాల ఆధునికీకరణ చేపడతాం. చైనా సార్వభౌమాధికారం, భద్రత, అభివృద్ధిని, సమర్ధంగా రక్షించ గల శక్తిగా సైన్యాన్ని గ్రేట్ వాల్ ఆఫ్స్టీల్గా మలుస్తాం. సరికొత్త భద్రతా విధానాలతో ముందుకెళ్తాం.” అని జిన్పింగ్ ప్రకటించారు.
మరోవైపు తైవాన్ చైనాలో భాగమని స్పష్టం చేస్తూ తైవాన్ వ్యవహారంలో ఇతర దేశాల జోక్యాన్ని , వేర్పాటువాద కార్యకలాపాలను చైనా బలంగా వ్యతిరేకిస్తుందని జిన్పింగ్ స్పష్టం చేశారు. జాతీయ పునరేకీకరణ ప్రక్రియను దృఢంగా ముందుకు తీసుకు వెళ్తామని తెలిపారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో అమెరికాతో పోటీ, భారత్ వంటి పొరుగు దేశాలతో సరిహద్దు వివాదాల నడుమ జిన్పింగ్ వ్యాఖ్యలు కీలకంగా మారాయి.
ప్రధాని లీ కియాంగ్ మీడియాతో మాట్లాడుతూ 5 శాతం వృద్ధి లక్ష్యాన్ని సాధించడంలో చైనా ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రస్తావించారు. అమెరికా తమ దేశాన్ని చుట్టుముడుతోందని, అణచివేసేందుకు యత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీరో కొవిడ్ విధానంతో మహమ్మారిపై చైనా నిర్ణయాత్మక విజయం సాధించిందని తెలిపారు.