విజయనగరం జిల్లా రాజాం మండలం అంతకాపల్లి గ్రామంలో నిర్మించిన శ్రీ పద్మావతి సహిత భూదేవి వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని శుక్రవారం టీటీడీ విలీనం చేసుకుంది. ఇప్పటిదాకా ఆలయాన్ని నిర్వహిస్తున్న బాలాజీ ట్రస్టు సభ్యులు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటల నుంచి 12.30 గంటల మధ్య టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డికి ఆలయానికి సంబంధించిన పత్రాలు అందజేశారు. ఇకమీదట ఈ ఆలయంలో టీటీడీ పద్ధతి ప్రకారం సేవలన్నీ నిర్వహిస్తారు.
అంతే కాకుండా ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మికంగా అభివద్ధి చేయనున్నారు. ఈ సందర్భంగా ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీ గ్రంథి మల్లిఖార్జునరావు నిర్మించిన ఈ ఆలయాన్ని బాలాజీ ట్రస్టు పర్యవేక్షణలో, జీఎంఆర్ వరలక్ష్మి పౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ ఆలయాన్ని టీటీడీ నిర్వహించాలని గ్రంథి మల్లిఖార్జునరావు కోరారని ఈవో తెలిపారు. టీటీడీ పాలకమండలి ఇందుకు ఆమోదించడంతో ఆలయాన్ని విలీనం చేసుకున్నామని చెప్పారు.
పాంచరాత్ర ఆగమయుక్తంగా ఆలయ నిర్వహణ జరుగుతుందని పేర్కొన్నారు. ఆలయాన్ని మరింత అభివద్ది పరిచేందుకు జీఎంఆర్తోపాటు రాజాం ప్రజలు, దాతల సహకారం తీసుకుంటామని తెలిపారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఇక్కడ కూడా అందుబాటులో ఉంచుతామని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానాల పరిధిలో ఇప్పటి వరకు సుమారు 60 ఆలయాలు ఉన్నాయని ఈవో తెలిపారు.
విశాఖపట్నం డిప్యూటీ ఈవో పరిధిలోకి రాజాం ఆలయం వస్తుందని చెప్పారు. రాజాం పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో శ్రీకాకుళం రోడ్డులో 3.5 ఎకరాల్లో రూ. 3 కోట్ల వ్యయంతో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త త్రిదండి చినజియర్ స్వామి పర్యవేక్షణలో ఆలయాన్ని నిర్మించారు. 2015లో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించి 2018 సంవత్సరంలో ప్రతిష్ట నిర్వహించారు.
అప్పటి నుంచి ట్రస్టు ద్వారా ఆలయ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రంధి ఈశ్వరరావు, గ్రంధి నీలాచలం, గ్రంధి భాస్కరరావు, కొల్లూరు వెంకట నాగేశ్వరరావు, జీఎంఆర్ కుటుంబసభ్యులు, భక్తులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.