భారత అంతరిక్ష పరిశోధన సంస్థ షార్ మరో వాణిజ్యపరమైన రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు ‘ఎల్విఎం3-ఎం3’ రాకెట్ను ప్రయోగించనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని రెండో ప్రయోగ వేదిక నుండి ఈ రాకెట్ను ప్రయోగించనున్నారు.
ఈ రాకెట్ ద్వారా యుకెకు చెందిన 36 ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నారు. వన్ వెబ్ ఇండియా-2 మిషన్ ద్వారా కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల ప్రకారం ఇప్పటికే ఒకసారి ఇస్రో 36 యుకె ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్ష కక్ష్యలో నిలిపింది.
ఇప్పుడు రెండవసారి మరో 36 ఉపగ్రహాలను భూమికి సమీపంలోని 450 కిలోమీటర్ల దూరంలో గల లియో ఆర్బిటల్ వృత్తాకారపు కక్ష్యలో ప్రవేశపెట్టబోతుంది. మొత్తం ఈ ఉపగ్రహాల బరువు 5805 కిలోల వరకు ఉంటుంది.
ప్రయోగం అనంతరం ఈ రాకెట్ 20 నిమిషాలపాటు అంతరిక్షం వైపు ప్రయాణించిన అనంతరం 36 ఉపగ్రహాలను ఒకదాని తర్వాత ఒకదానిని కక్షలోకి వదలడం జరుగుతుంది. ఎల్విఎం3- ఎం3 రాకెట్ ఎత్తు 43.5 మీటర్లు. బరువు 643 టన్నుల వరకు ఉంటుంది.
గతేడాది అక్టోబర్ 23న ఇదే తరహాలో రాకెట్ ప్రయోగం ద్వారా 36 ఉపగ్రహాలను కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన ఇస్రో అదే తరహా ఉత్సాహంతో ఇప్పుడు ఈ ప్రయోగం విజయానికి సన్నహాలు సిద్ధం చేస్తోంది. ఈ రాకెట్ ప్రయోగానికి సంబంధించిన 24 గంటల కౌంట్డౌన్ను శనివారం ఉదయం 9 గంటలకు ఇస్రో ప్రారంభిస్తుంది.