తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 30న ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభిస్తారు. ఆ రోజు ఉదయం మంత్రి ప్రశాంత్రెడ్డి శాస్త్రోక్తంగా జరిగే కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆ తర్వాత వేదపండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ప్రారంభ కార్యక్రమం ఉంటుంది. అదెప్పుడన్నది త్వరలోనే ప్రకటిస్తారు.
సచివాలయ ప్రారంభం తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ తొలుత తన సీట్లో కూర్చుంటారు. ఆ తర్వాత మంత్రులు, కార్యదర్శులు, సీఎంవో, సచివాలయ సిబ్బంది తమ చాంబర్లలో కూర్చుంటారు. ప్రారంభ కార్యక్రమానికి మొత్తం 2,500 మందిని ఆహ్వానిస్తున్నారు. ఇందులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు తదితరులు ఉంటారు.
సందర్శకులను మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఆగ్నేయ ద్వారం ద్వారా అనుమతిస్తారు. మెయిన్ గేటును మాత్రం ముఖ్యమంత్రి, సీఎస్, డీజీపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, చైర్మన్, ముఖ్యమైన ఆహ్వానితులు, దేశవిదేశీ అతిథులు, ప్రముఖుల కోసం వినియోగిస్తారు. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేకంగా విద్యుత్ బగ్గీలను ఉపయోగిస్తారు. సచివాలయంలోకి ప్రైవేటు వాహనాలను అనుమతించరు.
14న అంబేద్కర్ విగ్రవిష్కరణ
నూతన సచివాలయం వద్ద 125 అడుగుల ఎత్తులో నిర్మించిన అంబేద్కర్ మహా విగ్రహాన్ని ఈ నెల 14న అత్యంత వైభవోపేతంగా, చారిత్రాత్మక వేడుకగా,కన్నుల పండుగగా దేశం గర్వించే రీతిలో జరపాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి బౌద్ధ భిక్షువులను మాత్రమే ఆహ్వానించి వారి సాంప్రదాయ పద్దతిలోనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
దేశంలోనే అతి ఎత్తైన ఈ అంబేద్కర్ విగ్రహంకు 2016 ఏప్రిల్ 14న శంకుస్థాపన చేశారు. 2 ఎకరాల విస్తీర్ణంలో విగ్రహ నిర్మాణం చేపట్టగా విగ్రహ రూపశిల్పి పద్మభూషణ్ రామ్ వంజి సుతార్. 36 ఎకరాల్లో అంబేద్కర్ స్మృతివనం నిర్మించారు.