ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఎమినీ జాపరోవా ఆదివారం నుండి భారత్ లో నాలుగు రోజులపాటు పర్యటిస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తరువాత ఉక్రెయిన్ ప్రభుత్వ ప్రతినిధి భారత్ కు రావడం ఇదే ప్రథమం.
భారత్ కు రష్యా చిరకాల మిత్ర దేశం. భారత్ ఇబ్బందుల్లో ఉన్న చాలా సమయాల్లో రష్యా ఆదుకుంది. ఇప్పటికీ ఇంధనం, రక్షణ పరికరాల దిగుమతుల్లో భారత్ రష్యా పైననే ఆధారపడుతోంది. మరోవైపు, అమెరికా సహా పశ్చిమ దేశాలతో సకారాత్మక మైత్రి భారత్ కు అత్యవసరం. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఎమినీ జాపరోవా భారత పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
భారత పర్యటనలో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ప్రధానంగా భారత విదేశాంగ శాఖలోని సీనియర్ ప్రతినిధులతో చర్చలు జరుపుతారని సమాచారం. ఉక్రెయిన్, రష్యా యుద్ధానికి సంబంధించి ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులపై వారు చర్చించే అవకాశముంది.
అలాగే, రష్యా తో యుద్ధం నేపథ్యంలో ఆర్థికంగా ఉక్రెయిన్ దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. అందువల్ల ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి భారత్ ను మానవతా సాయం అడిగే అవకాశం ఉందని విదేశాంగ వ్యవహారాల నిపుణులు భావిస్తున్నారు. అలాగే, భారత ప్రధాని మోదీని ఆమె ఉక్రెయిన్ కు ఆహ్వానించే అవకాశముందని భావిస్తున్నారు.
అయితే, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ప్రధాని మోదీతో కానీ, మంత్రివర్గంలోని ఇతర మంత్రులతో కానీ ప్రత్యేకంగా సమావేశమవుతారా? అన్న విషయంలో స్పష్టత లేదు.
ఉక్రెయిన్ తో భారత్ కు మైత్రీపూర్వక సంబంధాలున్నాయని, ఇప్పుడు ఆ దేశ విదేశాంగ మంత్రి పర్యటనతో ఆ సంబంధాలు మరింత విస్తృమవుతాయని ఆశిస్తున్నామని భారత విదేశాంగ శాఖ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్ మంత్రి జాపరొవా భారత మీడియాతో మాట్లాడుతారని, ఢిల్లీలోని మేధావులతో సమావేశమవుతారని సమాచారం.
