టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఈడీ కూడా రంగంలోకి దిగింది. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో ఈడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు.
గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పేపర్ను ముందుగానే అందుకొని విదేశాల నుంచి వచ్చి పరీక్షలు రాశారనే అభియోగాలపై ఈడీ విచారణ ప్రారంభించింది. రూ.కోట్ల హవాలా రూపంలో చేతులు మారినట్లు ఈడీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
ఇప్పటికే ఈడీకి టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. సిట్ ఈ కేసులో సాక్షిగా చేర్చిన శంకర్ లక్ష్మిపై ఈడి ప్రధాన దృష్టి సారించింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కస్ట్రోడియన్గా ఉన్న ఆమె కంప్యూటర్ నుంచి ప్రశ్నాపత్రం లీక్ కావడంపై ఈడీ ప్రశ్నించనుంది.
ఈ మేరకు ఈడీ శంకర్ లక్ష్మీతో పాటు టీఎస్పీఎస్సీకి చెందిన సత్యనారాయణకు నోటీసులు జారీ చేసింది. బుధ, గురువారాల్లో విచారణకు హాజరుకావాలంటూ నోటీసుల్లో తెలిపారు. కోర్టు అనుమతితో ఈడీ ప్రవీణ్, రాజశేఖర్ కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు.