ఐపీఎల్ సీజన్ మొదలు కావడంతో దేశ వ్యాప్తంగా బెట్టింగ్ లు జోరందుకున్నాయి. తక్కువ సమయంలో ఈజీగా మనీ సాధించాలనే దురాశతో మ్యాచ్ కు ముందే బెట్టింగ్ కు పాల్పడుతు కోట్లు కొల్లగొడుతున్నారు. బాల్ బాల్ కు, ఓవర్ ఓవర్ కు ప్లేయర్లపైన ఇలా కోట్లల్లో దందా కొనసాగిస్తున్నారు.
ఐపీఎల్ మ్యాచ్ లపై ఆన్ లైన్లో బెట్టింగ్ జరుపుతున్న ముఠాను సైబారాబాద్ పోలీసులు గుట్టు రట్టు చేశారు. ఏప్రిల్ 10న ఆర్సీబీ, లక్నో సూపర్ జాయింట్ మ్యాచ్ సందర్భంగా బాచుపల్లిలోని ఓ ఇంట్లో 10 మంది బెట్టింగ్ రాయుళ్లను అరెస్ట్ చేశారు. పక్కా సమాచారం మేరకు బాచుపల్లిలోని సాయి అనురాగ్ కాలనీలోని ఓ ఇంటిపై ఎస్ ఓటీ పోలీసులు దాడి చేశారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.
10 మంది బుకీలను అరెస్టు చేసి వారి నుంచి రూ.60.39 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అరెస్టయిన వారి బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బు, ఆన్ లైన్ లో ఉన్న మనీ, స్వాధీనం చేసుకున్న నగదుతో కలిపి మొత్తం దాదాపు కోటి రూపాయలు ఉంటుందని చెప్పారు.
స్వాధీనం చేసుకున్న వాటిలో మూడు లైన్ బోర్డులు, 8 ల్యాప్టాప్లు, 3 టీవీలు, 8 కీప్యాడ్ ఫోన్లు, రెండు సీపీయూలు, కీ బోర్డులు, మానిటర్ సెట్ టాప్ బాక్స్, హెడ్సెట్లు, వైఫై రూటర్లు, ప్రింటర్, మైక్రోఫోన్లు, 10 స్మార్ట్ ఫోన్లు, మూడు టూ వీలర్ వాహనాలు ఉన్నాయని తెలిపారు. టీఎస్ గేమింగ్ యాక్ట్ సెక్షన్ 3, 4 కింద బుకీలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
బెట్టింగ్ ముఠాలో విజయవాడకు చెందిన ప్రధాన నిర్వాహకుడు పాండు పరారీలో ఉన్నాడని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. అరెస్టయిన వారిలో నలుగురు ఆంధ్రప్రదేశ్కు చెందినవారని చెప్పారు. అరెస్టయిన వారిలో వై.వెంకట శివరామ కృష్ణ, సింగమనేని కిరణ్ కుమార్, నందం శ్రీనివాస్ బాబు, కడియాల మహేష్, చెరెడ్డి కాశి, అద్దేపల్లి ప్రతాప్ గణ కుమార్, కె.విజయ్ కుమార్, జి. శ్రీకాంత్, ఎ.వినయ్, బి.వెంకట రత్న కుమార్ ఉన్నారు. డిజిటలైజేషన్, అధికంగా డబ్బులు సంపాదించాలనే ఆరాటంతో కొందరు క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.