సింహాచలం అప్పన్నస్వామి ఆలయంలో మరోసారి అపచారం చోటుచేసుకుంది. ఆలయంలో స్వామి నిజ రూపదర్శనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు వీడియో తీసి షేర్ చేయడం కలకలం రేపుతుంది. ఈ నెల 23 న సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవం కార్యక్రమ వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్ష్యమయ్యాయి.
ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనంలో ఉన్న స్వామివారి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. స్వామివారి అంతరాలయంలో ఫొటోలు, వీడియోలపై నిషేధం ఉన్నా ఇలా బయటకు రావడంతో కలకలం రేగుతోంది.
ఎంతో పవిత్రంగా కొలిచే స్వామివారి నిజరూప దర్శనానికి భక్తులు ఏడాది పాటు వేచి చూస్తూ అక్షయ తృతీయ నాడు ఒక్క రోజు మాత్రమే లభించే స్వామి నిజరూపదర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి నియమ, నిష్ఠాలుంటూ భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శనం చేసుకుంటారు.
అయితే అప్పన్న స్వామివారి నిజరూప దర్శనం బయటకు రావడంపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గత ఏడాది కూడా ఇలాంటి అపచారమే జరిగినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే మరోసారి కొందరు స్వామివారి గర్భాలయాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిపై విచారణ జరుపుతున్నామంటూ ఆలయ ఆధికారులు ప్రకటించి చేతులు దులుపుకున్నారు.
చందనోత్సవం రోజు ఆలయానికి ఊహించని రీతిలో భారీగా భక్తులు పోటెత్తడంతో, అందుకు తగిన ఏర్పాట్లు చేయడంలో ఆలయ అధికారులు ఘోరంగా విఫలమవడంతో తీవ్రమైన తొక్కిసలాట జరిగింది. దీనిపై `రాజగురు’గా పేరొందిన విశాఖ శారదా పీటం స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి సైతం తీవ్ర స్థాయిలో మండిమడ్డారు. ఆ వివాదం ముగియకముందే సింహాచలం చందనోత్సవంలో మరో అపచారం వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.
జాయింట్ కలెక్టర్ విశ్వనాథ్ విచారణ చేపట్టారు. దేవస్ధానంలో సీసీఫుటేజ్, ఇతర ఆధారాలను పరిశీలించారు. చందనోత్సవం టిక్కెట్లు భారీగా రీసైక్లింగ్ జరిగినట్టు కూడా అనుమానిస్తున్నారు. అయితే ఆ పని ఎవరు చేశారు అనే దిశగా బాధ్యులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు. అంతరాలయం వీడియోలు రికార్డింగ్, బయటకు రావడంపై దృష్టిసారించిన అధికారులు బాధ్యులపై కఠిన చర్యలు తప్పని హెచ్చరించారు.