వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వందకుపైగా సీట్లు సాధిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్లీనరీలో ప్రసంగిస్తూ ‘మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో 63, రెండో అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలిచాం. వచ్చే ఎన్నికల్లో 100కుపైగా సీట్లు గెలుస్తాం’ అంటూ భరోసా వ్యక్తం చేశారు.
నియోజకవర్గం వారీగా ప్రభుత్వం నుంచి కూడా ఇద్దరు నాయకులు బాధ్యతలు తీసుకోవాలని, పల్లెనిద్ర వంటి కార్యక్రమాలతో జనంతో మమేకం కావాలని దిశానిర్ధేశం చేశారు. కరెంటు, రోడ్లు, ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయం, పశుసంపద, మత్స్య సంపద ఇలా ప్రతీ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశమే ఆశ్చర్యపోయే ప్రగతిని నమోదు చేసిందని చెప్పుకొచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ప్రగతిని చూసేందుకు మహారాష్ట్ర వాళ్లు సొంత బండ్లేసుకుని వచ్చి చూసిపోతున్నారని చెప్పారు. క్యాడర్లో అసంతృప్త్తిని తగ్గించే చర్యలు చేపట్టి, ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడం, ప్రజలతో కమ్యూనికేషన్స్ పెంచుకోవడం, నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణను చేపట్టాలని సూచించారు.
మన ప్రభుత్వం అధికారంలోకి రావడమనేది పెద్ద టాస్క్ కాదు. మునపటి కన్నా ఎక్కువ సీట్లు రావాలి అనేది ప్రాధాన్యతాంశమని స్పష్టం చేశారు. ఎలక్షన్ షుడ్ బీ నాట్ బై చాన్స్.. బట్ బై చాయిస్ అని తెలిపారు. బీఆర్ఎస్ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవడానికి టీవీ యాడ్స్, ఫిల్మ్ ప్రొడక్షన్ కూడా మన పార్టీ నుంచి భవిష్యత్తులో చేపట్టవచ్చని చెబుతూ అవసరమైతే పార్టీ ఆధ్వర్యంలో టీవీ ఛానల్ను సైతం నడపొచ్చని ప్రకటించారు.
రాజకీయ పంథాలో తక్కువ నష్టాలతో తెలంగాణ సాధించుకున్నామని చెబుతూ పార్లమెంటరీ పంథాలో ఏదైనా సాధించవచ్చని స్వరాష్ట్ర సాధనతో దేశానికి తెలిపామని కేసీఆర్ వెల్లడించారు. అబ్కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు ముందుకు సాగుతున్నామని కేసీఆర్ చెప్పారు.
వ్యవసాయాన్ని నిలబెట్టి, రైతుల సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం పని చేస్తోందని చెబుతూ అకాల వర్షాలు రాక ముందే పంటకోతలు పూర్తయ్యేలా రైతులను చైతన్యం చేయాలని సూచించారు. రాష్ట్రంలో పాలన పారదర్శకంగా ఉండడం వల్లే పెట్టుబడులు వస్తున్నాయని స్పష్టం చేశారు.
దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువ అంటూ తెలివి ఉంటే బండమీద కూడా నూకలు పుట్టించుకోవచ్చని పేర్కొన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని కేసీఆర్ గుర్తు చేశారు.