ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న పెనక శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారడానికి రౌస్ అవెన్యూ కోర్టు గురువారం అనుమతించింది. ఈ మేరకు శరత్ చంద్రారెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్ను స్పెషల్ జడ్జి ఎంకె నాగ్పాల్ అనుమతించారు.
‘ఈ కేసు గురించి స్వచందంగా వాస్తవాలను వెల్లడించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ కేసులో అప్రూవర్గా ఉండాలనుకొంటున్నాను’ అని శరత్చంద్రారెడ్డి తన దరఖాస్తులో పేర్కొన్నారు. శరత్ చంద్రారెడ్డికి ఇటీవల ఢిల్లీ హైకోర్టు వైద్య కారణాలపై బెయిలు మంజూరు చేసింది.
హైదరాబాద్కు చెందిన అరబిందో ఫార్మా అధినేత అయిన శరత్ చంద్రారెడ్డి వివిధ సంస్థలు, వ్యక్తులతో సిండికేట్ ఏర్పాటు చేసుకుని అవినీతి మార్గంలో సొమ్ము కూడగట్టుకొని ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) అభియోగాలు చేసింది.
దీంతో పాటుగా నగదు అక్రమ చలామణి వ్యతిరేక చట్టం (పిఎంఎల్ఎ) కింద కేసు నమోదు చేసి ఆయనను అరెస్టు చేసింది. మద్యం కుంభకోణానికి సంబంధించి సిబిఐ దర్యాప్తు చేస్తున్న అవినీతి కేసులో ఇంతకు ముందు ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త దినేశ్ అరోరా అప్రూవర్గా మారారు.
శరత్చంద్ర రెడ్డి అప్రూవర్గా మారి ఇచ్చే సమాచారంతో ఈడీ మరికొందరు ముఖ్యులను అరెస్టు చేయనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేయడానికి తగినన్ని ఆధారాలను అటు సీబీఐ, ఇటు ఈడీ ఇప్పటి వరకు సేకరించలేకపోయింది.
కవిత బినామీగా దర్యాప్తు సంస్థలు చెబుతున్న అరుణ్ రామచంద్రన్ పిళ్లైని ఇప్పటికే అరెస్టు చేయగా, ఆమె వ్యాపార లావాదేవీలకు ఆడిటర్గా వ్యవహరించిన గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ నిందితుల జాబితాలో చేర్చి చార్జిషీట్ కూడా దాఖలు చేసింది.
అయితే ఈ ఇద్దరిలో అరుణ్ పిళ్లై కవితకు వ్యతిరేకంగా ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటున్నానంటూ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. మరోవంక, బుచ్చిబాబు కూడా అప్రూవర్ గా మారారు.
ఇదిలా ఉంటే కవితను ఈడీ మూడు పర్యాయాలు పిలిపించి ప్రశ్నించింది. ఆ తర్వాత మళ్లీ కేసులో ఎలాంటి కదలిక కనిపించలేదు. అయితే ఇప్పుడు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న శరత్చంద్ర రెడ్డి అప్రూవర్గా మారడంతో మళ్లీ కవిత వ్యవహారంలో కదలిక మొదలవుతుందని తెలుస్తోంది.