ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో కోర్టులో బుధవారం గ్యాంగ్స్టర్ సంజీవ్ మహేశ్వరీ జీవాను కాల్చివేశారు. దాడికి పాల్పడిన వ్యక్తి లాయర్ దుస్తులలో వచ్చినట్లు తెలిసింది. గ్యాంగ్స్టర్ సంజీవ్ రాష్ట్ర పోలీసుల కస్టడీలో ఉన్న దశలో కోర్టుకు తీసుకు వచ్చినప్పుడు ఈ కాల్పుల ఘటన జరిగింది.
కాల్పుల్లో మృతి చెందిన గ్యాంగ్స్టర్ను పట్టుకుంటే రూ 50వేల పారితోషికం ఉంటుందని ఇటీవలే ప్రకటించగా షహ్రాన్పూర్లో అరెస్టు అయ్యాడు. ఇప్పుడు పోలీసుల రక్షణ వలయంలో ఉన్నప్పుడే మృతి చెందిన సంజీవ్ హతుడైన, పేరు మోసిన గ్యాంగ్స్టర్ అతీఖ్ అన్సారీకి కుడిభుజంగా ఉంటూ వచ్చాడు.
లాయర్ వేషంలో వచ్చిన దుండగుడు తన రివాల్వర్ తీసి కాల్పులు జరిపినట్లు, ఈ ఘటనలో సంజీవ్ నెత్తురోడుతూ కింద పడిపోయి, చనిపోయినట్లు , అక్కడే ఉన్న ఓ యువతి గాయపడినట్లు తర్వాత పోలీసులు తెలిపారు. బిజెపి ఎమ్మెల్యే బ్రహ్మదత్త ద్వివేది హత్యకేసులో సంజీవ్ సహ నిందితుడుగా ఉన్నారు.
ఈ కేసులోనే ముక్తార్ నిందితుడుగా ఉండి కోర్టు ఆవరణలో తూటాలకు బలయ్యాడు. ఇప్పుడు సహ నిందితుడు కూడా చనిపోయ్యాడు.పలు కేసుల్లో నిందితుడుగా ఉన్న సంజీవ్ను భారీ భద్రత నడుమ కోర్టుకు తీసుకువచ్చినప్పుడే కాల్పులు జరిగాయి.
ఎవరికి ఎటువంటి అనుమానాలు తలెత్తకుండా దుండగుడు నల్లటి కోటు వేసుకుని లాయర్గా కోర్టు హాల్లోపలికి ప్రవేశించినట్లు వెల్లడైంది. కాల్పులు జరిపిన వ్యక్తిని లక్నో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యక్తిని విజయ్ యాదవ్గా గుర్తించారు. జీవా స్వయంగా అత్యంత నేర్పరి అయిన షూటర్గా పేరుతెచ్చుకున్నాడు,
చివరికి తూటాలకు ప్రాణాలు వదిలాడు. రాష్ట్రంలో గ్యాంగ్స్టర్ల పనిపడుతామని అసెంబ్లీలో స్వయంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ప్రకటించారు. ఈ క్రమంలో వరుసగా అనేక మంది గ్యాంగ్స్టర్ల ఏరివేత జరుగుతోంది. ఇప్పుడు జరిగిన కాల్పుల ఘటనలో గాయపడ్డ ఓ పోలీసు కానిస్టేబుల్ను, యువతిని లక్నో సివిల్ ఆసుపత్రికి చికిత్సకు తరలించారు. కాల్పుల ఘటన తర్వాత స్థానిక లక్నో కోర్టుకు భారీ ఎత్తున పోలీసు బలగాలు వచ్చి భద్రతను పెంచాయి.