తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల పున:పంపిణీపై కేంద్ర జలశక్తి 2023-24 నీటి సంవత్సరంలోనూ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనబడటం లేదు. 50:50 ప్రాతిపదికన కృష్ణా జలాలను పంపిణీ చేయాలని తెలంగాణ పట్టుబడుతున్నప్పటికీ బచావత్ ‘ట్రిబ్యునల్ ను అనుసరించి 66:34 నిష్పత్తినే కొనసాగించాలని నిర్ణయించినట్టు సమాచారం.
వేసవి కాలం పూర్తయి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే సమయం దగ్గర పడుతుంటంతో ఎగువన వర్షాలు పడితే కృష్ణాలో ప్రధాన ఉమ్మడి సాగు నీటి ప్రాజెక్టుగా ఉన్న శ్రీశైలంకు వరదలు వచ్చే సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో కృష్ణా జలాల్లో వాటాలను తేల్చాలని రెండు రాష్ట్రాలు పట్టుబడుతున్నాయి. దీనిపై గత ఏడాది దీనిపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఆధ్వర్యంలో రిజర్వాయర్ మేనేజ్ మెంట్ కమిటీ(ఆర్ఎంసీ) ఏర్పాటయింది.
రెండు రాష్ట్రాల్ర జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ లతో పాటు జెన్ కో ఉన్నతాధికారులు కూడా సభ్యులుగా ఉన్నారు. గత ఏడాది నుంచి ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు అనేకసార్లు ఆర్ఎంసీ సమావేశమైనా కృష్ణా జలాల పంపిణీపై ఏకాభిప్రాయం కుదరలేదు. 50:50 నిష్పత్తిపై తెలంగాణ పట్టుబడుతుండగా, ఏపీ ససేమిరా అంటోంది. రాష్ట్ర పునర్విభజన అనంతరం బచావత్ టైబ్యునల్ అవార్డు ప్రకారం ప్రాజెక్టులు, ఆయకట్టు ప్రాతిపదికన రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన రాతపూర్వక ఒప్పందాలను తిరగదోడటం చట్టరీత్యా సాధ్యం కాదని ఏపీ స్పష్టం చేస్తోంది.
పునర్విభజన అనంతరం 2015 జూలై 19న కేంద్ర జలశక్తి ముందు కృష్ణా జలాల్లో 66:34 నిష్పత్తి వాటాలపై ఏపీతో పాటు తెలంగాణ అధికారులు సంతకాలు చేశారు. ఈ మేరకు బచావత్ టైబ్యునల్ ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల గణాంకాలను లెక్కకట్టి ఏపీకి 512.04 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీలు కేటాయించారు.బచావత్ టైబ్యునల్ కేటాయింపులను సరిచేసే అధికారం ఎవరికీ లేదనీ, బ్రజేష్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటయిన కృష్ణా నదీ వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ (కెడబ్ల్యుడీటీ-2) తుది తీర్పు వెలువడే వరకు ఇవే కేటాయింపులు వర్తిస్తాయని ఏపీ చెబుతోంది.
రెండు రాష్ట్రాల్ర మధ్య ఒప్పందం కుదిరిన సందర్భంలో సీడబ్ల్యూసీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం కేడబ్ల్యుడీటీ -2కు సైతం పూర్వ కేటాయింపులకు జోలికి వెళ్ళే అధికారం లేదు..నీటి లభ్యత 65-75 శాతం ప్రాతిపదికన లెక్కించినపుడు అదనపు జలాలను రెండు రాష్ట్రాల్రకే కేటాయించేందుకు బ్రజేష్ కుమార్ టైబ్యునల్ పరిమితమవుతుందన్న సంగతిని తెలుసుకోవాలి.. ఈ నేపథ్యంలో తెలంగాణ డిమాండ్ చేస్తున్న 50:50 నిష్పత్తిని సమ్మతించే ప్రస్తక్తే లేదని ఏపీ చెబుతోంది.