ప్రపంచవ్యాప్తంగా నిరాశ్రయుల సంఖ్య రికార్డు స్థాయిలో 110 మిలియన్లకు చేరుకుంది. ఉక్రెయిన్, సూడాన్లలో యుద్ధాలు, ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభం వంటి పరిస్థితులతో లక్షలాది మంది భద్రత కోసం వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చిందని యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ (యుఎన్ హెచ్సిఆర్) పేర్కొంది.
గత ఏడాది సుమారు 19 మిలియన్ల (190 లక్షలు) మంది తమ ప్రాంతాలను వదిలి పెట్టి వేరే ప్రాంతాలకు తరలిరావడంతో ఆ ఏడాది నిరాశ్రయుల సంఖ్యలో అత్యధిక వార్షిక పెరుగుదల నమోదైందని యుఎన్హెచ్సిఆర్ బుధవారం విడుదల చేసిన ‘యాన్యువల్ ఫోర్స్డ్ డిస్ప్లేస్మెంట్ రిపోర్ట్’లో తెలిపింది. దీంతో గతేడాది చివరి నాటికి ఆ సంఖ్య 108.4కు చేరినట్లు పేర్కొంది.
2023లో ప్రపంచంలో బలవంతపు స్థల మార్పిడి నిరంతరం పెరుగుతూనే ఉందని, గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతోందని నివేదిక తెలిపింది. ధనిక దేశాలతో పోలిస్తే.. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడం పేద దేశాలకు భారంగా మారుతోందని నివేదిక వెల్లడించింది.
సూడాన్లో అంతర్యుద్ధం కారణంగా నిరాశ్రయుల సంఖ్య అధికంగా పెరిగి 110 మిలియన్లకు చేరుకుందని యుఎన్ రెఫ్యూజీ చీఫ్ ఫిలిప్పో గ్రాండి తెలిపారు. అలాగే సురక్షిత ప్రదేశాలను కోరుకుంటూ తమ స్వంత ప్రదేశాలను వీడిన వారు కూడా వీరిలో ఉన్నారు.
నివేదిక ప్రకారం 110 మిలియన్ల మందిలో శరణార్థులు, వలసదారులు 37.5 శాతం ఉన్నారు. వీటికి పరిష్కారాలు ఊహించడం కూడా కష్టతరంగా ఉందని, అలాగే ఈ నివేదిక రూపొందించడం కూడా అంత తేలిక కాదని అన్నారు. ఈ అంతర్జాతీయ ఉద్రిక్తతలు మానవతా సమస్యలకు దారితీస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.