విశాఖపట్నంలో వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ గురువారం కలకలం రేపింది. కిడ్నాపైన ఎంపీ భార్య జ్యోతి, కుమారుడు శరత్, ఆడిటర్ జీవీ లను వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కొద్దిసేపటికే పట్టుకోగలిగారు. ఉదయం రుషికొండలోని ఎంపీ ఇంట్లోకి కిడ్నాపర్లు చొరబడ్డారు. ఆ తర్వాత భార్య చేత ఆడిటర్కు ఫోన్ చేయించారు. ఆడిటర్ రాగానే ముగ్గుర్ని (ఎంపీ భార్య, కుమారుడు, ఆడిటర్) కలిపి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు.
వెంటనే పోలీసులు రంగంలోకి దిగి గాలింపు మొదలుపెట్టారు. కొద్దిసపటికే కిడ్నాప్కు గురైన ముగ్గురు సురక్షితంగా ఉన్నట్లు ఎంపీ స్వయంగా తెలిపారు. విశాఖ-ఏలూరు రోడ్డులో వీరిని గుర్తించినట్లు చెప్పారు. ఎంపీ సత్యనారాయణ ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఆర్థిక లావాదేవీలు కారణంగా కిడ్నాప్ అనుమానం వ్యక్తమవుతోంది. పాత నిందితుడు హేమంత్ ఈ కిడ్నాప్ చేయించినట్లు తెలుస్తోంది. వ్యాపార లావాదేవీల విషయంలో ముగ్గుర్ని కిడ్నాప్ చేసినట్టు సమాచారం.
కిడ్నాప్ చేసి రూ. 50 కోట్లు డిమాండ్ చేశారని వార్తలొచ్చాయి. ఎంపీ సత్యనారాయణ రుషికొండలో ఇటీవలే ఇల్లు నిర్మించి అక్కడే ఉంటున్నారు. ఆడిటర్ జీవీ విశాఖ స్మార్ట్ సీటీ చైర్మన్ మాజీ చైర్మన్గా పని చేశారు.
తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం వైఎస్సార్సీపీ పరిశీలకులుగా బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఎంపీ దగ్గర ఆడిటర్గా పనిచేస్తున్నారు. పట్టపగలు ఎంపీ ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేయడం విశాఖలో కలకలం రేపుతోంది.
