నేరుగా థియేటర్లో మాదిరిగా కొత్త సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోని కుటుంబమంతా కలిసి ఇంట్లోనే కూర్చొని వీక్షించే అవకాశం ”ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్” కల్పిస్తోందని ఏపీఎస్ఎఫ్ఎల్ ఛైర్మన్ పూనూరు గౌతంరెడ్డి తెలిపారు. లవ్ యూ టూ చిత్ర బృందంతో కలిసి పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సినిమా తీసే నిర్మాతకు, చూసే ప్రేక్షకుడికి లాభం కలిగేలా అతి తక్కువ ధరకే తొలిరోజే సినిమాను రాష్ట్ర ప్రజలు ఇంట్లో వీక్షించే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు.
ఏపీ ఫైబర్ నెట్ ద్వారా తొలి సినిమాగా రూ.99కి ఇప్పటికే ”నిరీక్షణ” అనే చిత్రాన్ని విడుదల చేశామని, రెండవ సినిమాగా ”లవ్ యూ టూ” చిత్రాన్ని కేవలం రూ.39లకే జూన్, 16న అంటే శుక్రవారం ఏపీఎస్ఎఫ్ఎల్ వేదికగా ద్వారా స్ట్రీమింగ్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఏపీఎస్ఎఫ్ఎల్ సబ్ స్క్రైబర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. సబ్ స్క్రైబ్ చేసుకున్నప్పటి నుండి 24 గంటల వరకు సినిమాను చూసే అవకాశం ఉంటుందని చెప్పారు.
తాము ఓటీటీ ప్లాట్ఫాంలకు కానీ, థియేటర్ల యాజమాన్యానికి గానీ, మరెవరికీ పోటీ కాదని ఆయన స్పష్టం చేశారు. చిన్న చిత్రాల నిర్మాతలను ప్రోత్సహించి, వీక్షకుడికి అతి తక్కువ ధరకే నేరుగా సినిమాను చేరువ చేయడం తమ ఉద్దేశమని చెప్పారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.13 ప్రకారం రూ.100 కోట్ల బడ్జెట్ మూవీకి మొదటి వారంపాటు టిక్కెట్ ధరను పెంచుకునే వెసులుబాటు కల్పించామని తెలిపారు.
అదేవిధంగా రూ.20 కోట్ల లోపు నిర్మించిన సినిమాలను చిన్న చిత్రాలుగా భావిస్తూ వాటిని కూడా పండుగరోజుల్లో, మరే సందర్భంలోనైనా విడుదల చేసే అవకాశం కల్పించామని చెప్పారు. ప్రతి థియేటర్లో పెద్ద చిత్రంతో పాటు- ఒక షో చిన్న చిత్రానికి కేటాయించే అవకాశం కల్పించామని పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో థియేటర్లలో ప్రదర్శించే ప్రతి చిత్రాన్ని ఏపీ ఫైబర్నెట్ ద్వారా వీక్షించే అవకాశం కల్పిస్తామని వివరించారు. భవిష్యత్తులో పెద్ద సినిమాలను కూడా ఫైబర్ నెట్ ద్వారా విడుదల చేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.