ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ శనివారం కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, పీయూష్ గోయల్ లతో భేటీలు జరిపి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. మొదట కేటీఆర్ ఎంపీలు రంజిత్ రెడ్డి, కొత్త ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురిని కలిశారు. అయితే, రాత్రి హోమ్ మంత్రి అమిత్ షాను కలవాల్సి ఉన్నప్పట్టికీ ఆయన తీరిక లేకుండా ఉండడంతొ కలవడం సాధ్యం కాలేదు.
రాష్ట్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం, పెట్రోలియం సహజ వాయు శాఖలకు సంబంధించిన అంశాలపై చర్చించి వినతిపత్రాలు సమర్పించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ రెండవ దశ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని ఆయన కోరారు.
లక్డీకపూల్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు 26 కిలోమీటర్లు, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు ఐదు కిలోమీటర్ల మెట్రోకు ఆమోదంతో పాటు కేంద్రం ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరి పట్టణ పేదల కోసం ప్రత్యేకంగా ఉపాధి హామీ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురావాలంటూ మరో ప్రతిపాదన సమర్పించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర పరిధిలో చేపట్టిన మిస్సింగ్ , లింకు రోడ్ల కార్యక్రమాలు విజయవంతంగా నడుస్తున్నాయని ఇప్పటికే 22 మిస్సింగ్ లింక్ రోడ్లను పూర్తి చేశామని, మరో 17 రోడ్ల నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయని కేటీఆర్ తెలిపారు.
ఇదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి పరిసర పురపాలికలకు మొత్తం 104 అదనపు కారిడార్లను నిర్మించేందుకు దాదాపు 2,400 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సుమారు 800 కోట్ల రూపాయలను ఈ ప్రాజెక్టు కోసం కేటాయించాలని కేటీఆర్ కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.