టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నివాసముంటున్న కరకట్ట వద్ద ఉన్న లింగమనేని రమేశ్ గెస్ట్ హౌస్ జప్తుకు ఏపీ సిఐడికి అనుమతి ఇస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు కీలక తీర్పునిచ్చింది. తొలుత లింగమనేని రమేశ్కు నోటీసు ఇవ్వాలని ఆదేశించింది.
ఉండవల్లి కరకట్ట వద్ద ఉన్న లింగమనేని రమేశ్ గెస్ట్హౌస్ను అటాచ్ చేయాలంటూ ప్రభుత్వం ఇటీవల జీవో విడుదల చేసింది. ఇందులో భాగంగానే సీఐడీ కోర్టులో అనుమతి పిటిషన్ వేసింది. ఇక మాజీ మంత్రి నారాయణకు చెందిన ఆస్తులను పాక్షికంగా జప్తు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
రాజధాని అమరావతి కోసం భూ సమీకరణలో అక్రమాల నేపథ్యంలో ఉండవల్లిలో ఈ ఇంటిని అటాచ్ చేస్తూ ఏపీ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఇంటిని జప్తు చేయడానికి సీఐడీ ప్రయత్నిస్తోంది. ఇంటిని జప్తు చేయడానికి ఏసీబీ కోర్టును ఏపీ సిఐడి ఆశ్రయించింది. దీనిపై సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లలో లింగమనేనికి లబ్ది చేకూర్చి బదులుగా ఆయన ఇంటిని గెస్ట్ హౌస్గా పొందారని సీఐడీ అభియోగాలు మోపింది. కరకట్టపై చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని రమేష్ ఇంటిని జప్తు చేసేందుకు అనుమతివ్వాలని కోర్టును కోరింది.
ఏపీ సీఐడీ తరపున రెండు పిటిషన్లను ఏసీబీ కోర్టులో దాఖలు చేశామని సీఐడీ తరపు లాయర్ గతంలో వివేకానంద తెలిపారు. లింగమనేని రమేష్ ఇల్లు అటాచ్ మెంట్ పిటిషన్ ఒకటి కాగా, మాజీమంత్రి నారాయణ బంధువుల ఆస్తుల జప్తు పిటిషన్ మరొకటని కోర్టుకు వివరించారు.
1944 ఆర్డినెన్స్ ప్రకారం తన పిటిషన్పై ఆర్డర్ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. నేరం జరిగిందా లేదా అనేది తెలుసుకునేందుకు అవసరమైతే అఫిడవిట్ వేసిన అధికారిని కోర్టు విచారణ చేయవచ్చన్నారు. ఈ దశలో ప్రతివాదులకు నోటీసు ఇచ్చే అవకాశం లేదని చెప్పినట్లు తెలిపారు.
జప్తు ఉత్తర్వులు ఇవ్వటమా, నిరాకరించటమా అనేది ఆదేశాలు వచ్చిన తర్వాత ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. క్రిమినల్ లా సవరణ ఆర్డినెన్స్-1944 నిబంధన ప్రకారం అటాచ్మెంట్కు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి ముందే ప్రతివాదులకు నోటీసు ఇచ్చి వాదనలు వినాల్సిన అవసరం లేదన్నారు.
వ్యాపారవేత్త లింగమనేని రమేష్ తరఫున వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని న్యాయవాది సోము కృష్ణమూర్తి కోరారు. కోర్టులో దాఖలు చేసిన దస్త్రాలను ప్రతివాదులకు ఇవ్వాలని సీఐడీని ఆదేశిస్తూ మే 17న న్యాయస్థానం ఆదేశాలిచ్చిందని గుర్తుచేశారు.
ఆ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఇప్పటివరకు దస్త్రాలను తమకు అందజేయలేదని గత విచారణలో వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు జప్తు చేసేందుకు సీఐడీకి అనుమతి ఇవ్వటంతో లింగమనేనితో పాటు మాజీ మంత్రి నారాయణకు ఎదురుదెబ్బగానే చెప్పొచ్చు.