రాజకీయ పార్టీలు తమ ఆర్థిక వివరాలను నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం కొత్తగా ఆన్లైన్ పోర్టల్ను ప్రారంభించింది. రాజకీయ పార్టీలు తమ ఆర్థిక వివరాలతో పాటు పార్టీలకు సంబంధించిన ఎన్నికల ఖర్చులు, పార్టీకి వచ్చిన విరాళాలకు సంబంధించిన వివరాలను ఈ పోర్టల్లోనే నమోదు చేయాలని తెలిపింది.
దేశంలో ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించే లక్ష్యంతో ఎన్నికల సంఘం ఈ ఆన్లైన్ పోర్టల్ను ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. ”సమగ్రమైన ఎన్నికల వ్యయ పర్యవేక్షణ పథకం” లో భాగంగా ఎలక్షన్ కమిషన్ ఈ పోర్టల్ను 3సీ వ్యూహంలో తీసుకువచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
అక్రమ నిధులను అరికట్టడం, రాజకీయ పార్టీల నిధులు, ఖర్చుల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యమని పేర్కొన్నారు. ఏడాది పాటు ఎలక్షన్ కమిషనర్ రాజీవ్కుమార్ పర్యవేక్షణలో ఈ పోర్టల్ పనిచేస్తుందని వెల్లడించాయి. ప్రజాప్రాతినిథ్య చట్టం, 1951 మరియు కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఆర్థిక నివేదికలను రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ ఎలక్టోరల్ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది.
అయితే రాజకీయ పార్టీలు తమ ఆర్థిక నివేదికను ఆన్లైన్లో ఇవ్వకూడదని భావిస్తే.. అందుకు గల కారణాలను రాతపూర్వకంగా తెలియజేయాలని ఇసి తెలిపింది. ఒకవేళ ఆన్లైన్లో సమర్పించకపోతే నిర్దేశించిన ఫార్మాట్లో సిడిలు, పెన్డ్రైవ్లు, హార్డ్ కాపీ ఫార్మాట్లో నివేదికను అందజేయాలని స్పష్టం చేసింది.
ఆన్లైన్లో ఆర్థిక నివేదికలను దాఖలు చేయనందుకు పార్టీ పంపిన సమర్థన లేఖతో పాటు అలాంటి అన్ని నివేదికలను ఆన్లైన్లో ప్రచురిస్తుందని పేర్కొంది. ఈ ప్రక్రియ ద్వారా రాజకీయ పార్టీల ఆర్థిక వ్యవహారాలను ప్రజలకు అందించడంతో పాటు వారికి అవగాహన కల్పిస్తుందని తెలిపింది.