భారతదేశ జిడిపిలో మత్స్య ఉత్పత్తుల రంగం ప్రధానమైనదని కేంద్ర సముద్ర విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా సముద్ర సమాచార వ్యవస్థల భారత జాతీయ కేంద్రం ఆధ్వర్యంలో సముద్ర సమాచారం, సలహా సేవలపై భారీ అవగాహన కార్యక్రమం శుక్రవారం కృష్ణా జిల్లా మచిలీపట్నం రెవెన్యూ కల్యాణ మండపంలో నిర్వహించారు.
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, బందరు పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ తదితరుల సమక్షంలో కేంద్ర మంత్రి జ్యోతి ప్రజ్వలన గావించి అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ సముద్ర సమాచార వ్యవస్థల భారత జాతీయ కేంద్రం హైదరాబాద్ వారు మత్స్యకారులు చేపల వేట యజమానులకు నిరంతరం సముద్ర సమాచారం అందిస్తున్నారని తెలిపారు.
సునామీ వంటి ప్రకృతి విపత్తుల విషయంలో ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నారని పేర్కొన్నారు. సముద్రంలో చేపలు సమృద్ధిగా దొరుకు ప్రాంతాలను గుర్తించి మత్స్యకారులు బోటు యజమానులకు తెలియజేస్తూ, సముద్రంలో ప్రమాదకరమైన ప్రాంతాలను గుర్తించి హెచ్చరించడం వంటి బృహత్తర సమాచారాన్ని అందజేస్తున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు.
ఇంతటి బృహత్తర కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓ షన్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఐ ఎన్ సి ఓ పి ఐ) వారు వారి కార్యకలాపాలను సముద్ర సంబంధిత సమాచారాన్ని మత్స్యకారులకు నేరుగా/ ప్రత్యక్షంగా వివరించి అవగాహన కల్పించేందుకు భారత ప్రభుత్వ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా భారతదేశ తూర్పు, పశ్చిమ తీరాలలో నిర్వహించ తలపెట్టిన 5 వర్క్ షాపుల్లో మొదటిగా ఆంధ్రప్రదేశ్ లో మచిలీపట్నంలో నేడు వర్క్ షాప్ ఏర్పాటు చేయడం మనందరికీ ఆనందదాయకమని చెప్పారు.
భారతదేశానికి అపార సముద్ర తీరం ఉండడం మత్స్య రంగ అభివృద్ధికి దోహదం చేస్తున్నదని కేంద్ర మంత్రి తెలిపారు. భారతదేశ జిడిపిలో మత్స్యరంగానిదే అగ్రస్థానం పేర్కొంటూ సముద్ర తీరం అధికంగా గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్య రంగ అభివృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు 2047 నాటికి భారతదేశ అభివృద్ధికి ప్రధాని దిశ నిర్దేశం చేశారని తెలిపారు.
