హైదరాబాద్ లోని శామీర్పేట్ సెలబ్రిటీ క్లబ్లో శనివారం జరిగిన కాల్పుల కేసు సంచలనం సృష్టిస్తోంది. సిద్ధార్థదాస్ అనే వ్యక్తిపై మనోజ్ ఎయిర్గన్తో కాల్పులు జరపడంతో సిద్ధార్థ్ తప్పించుకొని, శామీర్పేట పోలీసులను ఆశ్రయించాడు. నటుడు మనోజ్పై ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం రిమాండ్కు తరలించారు.
శామీర్పేట్ సెలబ్రిటీ క్లబ్లో శనివారం కాల్పుల ఘటన కలకలం రేపగా, పలు సంచలనాలకు దారితీస్తుంది. సిద్ధార్థ దాస్ అనే వ్యక్తి భార్య వద్దకు రాగా, ఆమెతో సహజీవనం చేస్తున్న నటుడు మనోజ్ తో గొడవ జరిగింది. ఈ క్రమంలో మనోజ్ కుమార్ ఎయిర్ గన్తో సిద్ధార్థ దాస్పై కాల్పులు జరిపాడు.
అప్రమత్తమైన సిద్ధార్థ్ అక్కడి నుంచి తప్పించుకుని శామీర్ పేట్ పోలీసులను ఆశ్రయించాడు. నటుడు మనోజ్ తనపై కాల్పులు జరిపాడని ఫిర్యాదు చేయగా, ఆర్స్ యాక్ట్ కింద మనోజ్పై పోలీసులు కేసు నమోదు చేసి, ఆదివారం రిమాండ్ కు పంపారు.
తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా వున్న స్మిత భర్త సిద్ధార్ధ్ మీడియాతో మాట్లాడుతూ అసలు మనోజ్కు స్మితతో ఎలా పరిచయం ఏర్పడిందో తనకు తెలియదని చెప్పారు. మనోజ్ను తాను ఎప్పుడూ చూడలేదని, 2018 నుంచి స్మిత తనకు దూరంగా వుంటోందని సిద్ధార్ధ్ చెప్పాడు.
2019లో విడాకుల కోసం స్మిత కోర్టుకు వెళ్లిందని తెలిపాడు. తన పిల్లలు సీడబ్ల్యూసీని ఆశ్రయిస్తే అధికారులు తనకు ఫోన్ చేసి పిలిచారని అందుకే శామీర్పేట్ వెళ్లినట్లు సిద్ధార్ధ్ వెల్లడించాడు. ఈ క్రమంలోనే మనోజ్ తనపై కాల్పులకు పాల్పడ్డాడని, తుపాకీ ఎక్కుపెట్టగానే భయం వేసిందని, వెంటనే అక్కడి నుంచి పారిపోయానని పేర్కొన్నాడు.
బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశానని సిద్ధార్ధ్ చెప్పాడు. సీడబ్ల్యూసీ అధికారులు తన స్టేట్మెంట్ తీసుకున్నారని సిద్ధార్ధ్ వెల్లడించారు. ఎపిలోని విశాఖపట్నానికి చెందిన 49 ఏళ్ల సిద్దార్థదాస్కు ఒఢిశాలోని బరంపూర్ కు చెందిన 43 ఏళ్ల స్మితాదాస్ తో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.
వీరికి ప్రస్తుతం 17 ఏళ్ల వయసున్న కుమారుడు, 13 ఏళ్లున కుమార్తె ఉన్నారు. అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో స్మిత విడాకులు కావాలంటూ 2019లో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. పిల్లలతో పాటు తాను వేరే చోట ఉంటానని, అక్కడకు తన భర్తని రానీయకుండా చూడాలంటూ కోర్టును కోరింది. ఆదేశాలను కూడా తెచ్చుకుంది.
ప్రస్తుతం ఇద్దరు పిల్లల్ని తన వందే ఉంచుకొని చూసుకుంటుంది స్మిత. ఒత్తిడి, మానసిక సమస్యలతో బాధపడే వారికి స్మితాదాస్ కౌన్సిలింగ్ ఇచ్చేది. శంభో శివ శంభో, వినాయకుడు చిత్రాల్లో నటించిన 39 ఏళ్ల మనోజ్ కౌన్సిలింగ్ తీసుకున్నాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇతడు ఒత్తిడి భరించలేక స్మితా వద్ద కౌన్సిలింగ్ కు వచ్చాడు.
ఇలా వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి సహజీవనానికి దారి తీసింది. అయితే గత మూడేళ్లుగా వీరిద్దరూ శామీర్ పేటలోని సెలబ్రిటీ విల్లాలో నివాసం ఉంటున్నారు. అయితే ఇటీవలే వీరిద్దరూ కలిసి విజయవాడలో ఓ కార్యాలయం ప్రారంభించినట్లు పోలీసులు గుర్తించారు.
ఇలా ఉండగా, మనోజ్ తననూ, తన చెల్లిని ప్రతి రోజూ కొడుతున్నాడని, తీవ్రంగా వేధిస్తున్నాడని స్మితా దాస్ కుమారుడు జూన్ 12వ తేదీన బాలల సమరక్షణ కమిటీని ఆశ్రయించాడు. తల్లి వద్ద కానీ, వారి బంధువుల వద్ద కానీ ఉండనంటూ చెప్పాడు. దీంతో సీడబ్ల్యూసీ అధికారులు బాలుడిని సంరక్షణ గృహానికి తరలించారు. ఈనెల 18వ తేదీన బాలికతో కలిసి స్మితా విచారణకు రావాలని సీడబ్ల్యూసీ అధికారులు స్మితకు నోటీసులు పంపించారు.