ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ నూతన ప్రధాన న్యాయమూర్తిగా రాబోతున్నారు, బాంబే హైకోర్ట్ న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. జమ్మూకాశ్మీర్కి చెందిన ఆయన నియామకాన్ని ప్రతిపాదిస్తూ జులై 5న సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. దీన్ని న్యాయశాఖ ఆమోదించింది.
తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దాంతో జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నియామకానికి సంబంధించి కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బాంబే హైకోర్ట్ న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఎప్పుడు బాధ్యతలు తీసుకుంటారో అప్పటి నుంచి ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి అవుతారని ఉత్తర్వుల్లో తెలిపారు.
దీనికి సంబంధించి.. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మెగ్వాల్.. సోమవారం ఓ ట్వీట్ చేశారు. 1964 ఏప్రిల్ 25న పుట్టిన జస్టిస్ ఠాకూర్. 1989లో ఢిల్లీ బార్ కౌన్సిల్లో అడ్వకేట్ అయ్యారు. తర్వాత జమ్మూకాశ్మీర్ బార్ కౌన్సిల్కి వెళ్లారు. 2011లో సీనియర్ అడ్వకేట్ అయ్యారు.
తర్వాత 2013 మార్చి 8న జమ్మూకాశ్మీర్ హైకోర్టుకు శాశ్వత జడ్జిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2022 జూన్ 10న ఆయనను బాంబే హైకోర్టుకు ట్రాన్స్ఫర్ చేశారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి తాత్కాలిక సీజేగా జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 37 మంది న్యాయమూర్తులు ఉండవచ్చు. కానీ ప్రస్తుతం 30 మంది మాత్రమే ఉన్నారు. మరో 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.