కేసీఆర్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్టీసి ప్రభుత్వ విలీనం బిల్లుపై అయోమయం నెలకొన్నది. ఈబిల్లు పరిశీలనకు న్యాయ సలహా కోసం సమయం కావాలని గవర్నర్ కార్యాలయం ప్రకటించడంతో బిల్లు ఆమోదంపై చీకట్లు కమ్ముకున్నాయి. ఆర్టీసి కార్మికులను ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి తీర్మానం చేసి 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసింది.
తాజాగా నడుస్తున్న అసెంబ్లీలో బిల్లు పాస్ చేయాలనే ధృడ సంకల్పంతో, ఇందుకు సంబంధించి కార్యాచరణను యుద్దప్రాతిపదికన చేపట్టి బిల్లును రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి ఈనెల 2వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు గవర్నర్కు పంపింది. సాంకేతికపరంగా చూస్తే ఇది ఆర్ధిక పరమైన కావడంతో ఆమోదంకోసం రాష్ట్ర గవర్నర్కు ఇప్పటికే పంపించింది.
ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ముగిసే సమయానికి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుపై గవర్నర్ నుంచి ఆమోదం రావడం తప్పనిసరి. కాగా రెండు రోజులుగా రాష్ట్ర గవర్నర్ బిల్లుపై తన అభిప్రాయాన్ని చెప్పకపోవడంతో ప్రభుత్వంలో కలవరం రేగుతుంది.
చివరకు శుక్రవారం ఆర్టీసీ బిల్లు విషయంలో రాజ్ భవన్ కీలక ప్రకటన చేసింది. ఈ బిల్లును. పరిశీలించేందుకు మరికొంత సమయం అవసరం అని స్పష్టం చేసింది. ఆర్టీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి గవర్నర్ నుండి అనుమతి రాలేదని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం రాజ్ భవన్ అధికారులు స్పష్టత ఇచ్చారు.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ఒక రోజు ముందే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడానికి సంబంధించిన బిల్లు రాజ్ భవన్ కు వచ్చిందని తెలిపారు. అయితే ఈ అభ్యర్థనపై నిర్ణయం తీసుకోవడానికి ముందు బిల్లును పరిశీలించి లీగల్ ఒపీనియన్ తీసుకోవడానికి మరికొంత సమయం అవసరం అని స్పష్టం చేశారు.
రాజ్భవన్ ను ముట్టడిస్తాం
కాగా, రాష్ట్ర ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని క్యాబినెట్లో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుని పంపిన బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడం సరైన విధానం కాదని టిఎంయు ప్రధానకార్యదర్శి థామస్రెడ్డి మండిపడ్డారు. ఇది 43 వేల మంది ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమస్యని గవర్నర్ పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
మా జీవితాలలో వెలుగులు నింపే ఈ బిల్లును వెంటనే ఆమోదించాలని లేనిపక్షంలో ఆర్టీసీ కార్మికులంతా నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలను చేపడతామని అవసరమైతే రాజ్ భవన్ ముట్టడికి కూడా వెనకాడమని హెచ్చరించారు.
రాష్ట్రవ్యాప్తంగా రెండు గంటలపాటు ఆర్టీసి బంద్ కు శనివారం ఉదయం ఆర్టీసి మజ్దూర్ యూనియన్ పిలుపునిచ్చింది. ఉదయం 8 గంటల వరకు ఆర్టీసి బస్సులు బంద్ పాటించి నిరసన తెలిపేందుకు యూనియన్ నిర్ణయించింది. దీంతో ఆర్టీసి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
