పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్కి ఎదురుదెబ్బ తగిలింది. తోషాఖానా అవినీతి కేసులో ఇస్లామాబాద్ జిల్లా, సెషన్స్ కోర్టు ఇమ్రాన్ని దోషిగా తేల్చుతూ తీర్పునిచ్చింది. ఈ అవినీతి కేసుపై సెషన్స్ కోర్టు న్యాయమూర్తి హుమయూన్ దిలావర్ ఇమ్రాన్ఖాన్కి మూడేళ్లపాటు జైలు విధిస్తూ తీర్పునిచ్చారు.
అలాగే ఐదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేశారు. ఈ కేసులో కోర్టు తీర్పు అనంతరం శనివారం ఇమ్రాన్ అరెస్టయ్యారు. అయితే కోర్టు తీర్పును ఇమ్రాన్ఖాన్ ఖండించారు. ఈ కేసులో అతని తరపున వాదించే న్యాయవాదబృందం వెంటనే అప్పీల్ దాఖలు చేయనున్నట్లు ఇమ్రాన్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన తరపున వాదించిన న్యాయవాది ఒకరు మాట్లాడుతూ.. ‘ఈ కేసులో సాక్షులను హాజరు పరచడానికి మాకు అవకాశం ఇవ్వలేదు. వాదనలను పూర్తి చేయడానికి సమయం కేటాయించలేదు. మావైపు వాదనల్ని వినకుండానే కోర్టు తీర్పునిచ్చింది.’ అంటూ ఆరోపించారు.
మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించిన కోర్టు అరెస్టు వారెంట్ కూడా జారీ చేసింది. దీంతో క్షణాల వ్యవధి లోనే ఇమ్రాన్ ఖాన్ను పోలీస్లు అరెస్టు చేశారు. లాహోర్ లోని తన నివాసం నుంచి ఆయనను పోలీస్లు అదుపు లోకి తీసుకున్నారు. కోట్లక్పత్ జైలుకు ఆయనను తరలిస్తున్నట్టు పంజాబ్ పోలీస్లు వెల్లడించారు.
కాగా, గత ఏడాది ఏప్రిల్లో అవిశ్వాస తీర్మానం కారణంగా ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతుడైన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి ఆయనను కేసులు చుట్టుముట్టాయి. ఇమ్రాన్ ఖాన్ ప్రధాన మంత్రి పదవిలో ఉండగా, విదేశీ పర్యటనల్లో ఆయనకు వచ్చిన బహుమతులను అక్రమ పద్ధతిలో అమ్ముకున్నట్టు ఆరోపణలు వచ్చాయి.
దీనిపై కేసు నమోదైంది. ఇమ్రాన్ తన హయాలో దాదాపు 58 ఖరీదైన బహుమతులు అందుకున్నారు. వాస్తవానికి వీటిని తోషాఖానాలో జమ చేయాలి. అయితే వాటిని సొంతం చేసుకోవాలనుకుంటే నిబంధనల ప్రకారం సగం ధర చెల్లించి తీసుకోవాలి. కానీ ఇందులో రూ. 38 లక్షల రోలెక్స్ గడియారాన్ని కేవలం రూ. 7,54,000 చెల్లించి సొంతం చేసుకొన్నారు. రూ. 15 లక్షల విలువ చేసే మరో రోలెక్స్ గడియారానికి రూ. 2,94,000 మాత్రమే చెల్లించారు.
ఇలా మూడోవంతు కంటే తక్కువగా చెల్లించి పలు కానుకలను ఇంటికి చేర్చుకున్న ఇమ్రాన్ రూ.8 లక్షల కానుకలను రూపాయి కూడా ఖజానాకు జమ చేయకుండానే తీసుకొన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆ తర్వాత వాటిని దుబాయిలో అమ్ముకొన్నారని మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపించారు.
తెహ్రీక్ ఇఇన్సాఫ్ (పిటిఐ) పార్టీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ పంజాబ్ పోలీస్లు పనిగట్టుకుని తుపాకీతో బెదిరించి కిడ్నాప్ చేయడమేనని పార్టీ శనివారం ధ్వజమెత్తింది. అరెస్ట్ను వ్యతిరేకిస్తూ పిటిఐ అడిషనల్ సెక్రటరీ జనరల్ ఉమెయిర్ నియాజీ లాహోర్ కోర్టులో శనివారం పిటిషన్ దాఖలు చేశారు.
ఎలాంటి జాప్యం లేకుండా తన పిటిషన్పై విచారణ జరపాలని, ఇమ్రాన్ భద్రతను నిర్ధారించడానికి తక్షణమే కోర్టు ముందు ఇమ్రాన్ను హాజరు పర్చాలని పంజాబ్ పోలీస్లకు, ప్రభుత్వానికి ఆదేశించాలని పిటిషన్దారుడు ఉమెయిర్ తన పిటిషన్లో అభ్యర్థించారు.