మునుగోడు ఉప ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు అని ప్రకటించిన కేసీఆర్, ఇప్పుడు ఏకపక్షంగా తమ అభ్యర్థులను ప్రకటించడం పట్ల ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయి. బిఆర్ఎస్తో పొత్తు చెడిపోతే వ్యక్తిగతంగా కెసిఆర్ను దూషించమని విధానపరంగా తేల్చుకుంటామని వామపక్షాలు స్పష్టం చేశాయి. వచ్చే ఎన్నికల్లో శక్తికి మించి కృషి చేసి, కమ్యూనిస్టుల సత్తా ఏంటో చూపిస్తామని కమ్యూనిస్టు నేతలు కూనంనేని, తమ్మినేని పరోక్షంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను హెచ్చరించారు.
హైదరాబాద్ మగ్దం భవన్లో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల సమావేశం మంగళవారం జరిగింది. అనంతరం మీడియాతో సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ రాజకీయాల్లో మోసం చేసే వారు, మోసపోయేవాళ్లు ఉంటారని చెబుతూ మునుగోడులో బిజెపిని ఓడించేందుకే తాము బిఆర్ఎస్కు మద్దతిచ్చామని తెలిపారు.
బిఆర్ఎస్తో పొత్తుల కోసం తాము ఎప్పుడూ వెంపర్లాడలేదని చెబుతూ సిపిఎం, సిపిఐ… రెండు కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నాయని చెప్పారు. తమతో ఎవరైనా కలిసి వస్తే పోటీకి సిద్ధమని, లేదంటే కమ్యూనిస్టు పార్టీలు కలిసి వెళ్లాలని, సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
వామపక్షాలకు సగం పైగా సీట్లలో ప్రభావం చూపే ఓటు బ్యాంకు ఉన్నదంటూ మునుగోడు ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలుపొందడం వెనుక సిపిఐ, సిపిఎం ఓట్లే కారణమన్న అభిప్రాయాన్ని అన్ని పార్టీల నేతలు వ్యక్తం చేశారన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బిజెపి నుంచి పోటీ చేసిన అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సైతం తన ఒటమికి ప్రధాన కారణం కమ్యూనిస్టులే అని బహిరంగంగా ప్రకటించారని చెప్పారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ తమతో కలిసి వచ్చే వారితో తాము పని చేస్తామని తెలిపారు. ఎన్డిఎ, ఇండియా కూటమిలకు సమదూరంలో ఉంటామని బిఆర్ఎస్ నేతలు చెప్పారని, . అందుకే వారికి తాము ఇండియా కూటమిలో ఉండటం నచ్చలేదని పేర్కొన్నారు.
కేరళలో తమకు కాంగ్రెస్తో విభేదాలు ఉన్నాయని, కానీ బిజెపిని ఓడించేందుకు కలవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. బిజెపి, బిఆర్ఎస్ ఒక్కటే అని అనడం లేదని, కానీ బిజెపికి వ్యతిరేకంగా కెసిఆర్ జాతీయస్థాయిలో ఉండాలని స్పష్టం చేశారు.
రెండు పార్టీలు రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ నెల 27వ తేదీ తర్వాత రెండు పార్టీల నేతలు మరోసారి భేటీ కానున్నారు.