ప్రపంచంలోనే అత్యంత అధిక కాలుష్యం ఉన్న నగరంగా ఢిల్లీ నమోదు అయ్యింది. ఇక ఆ నగరంలో నివసిస్తున్న ప్రజల ఆయుష్షు 12 ఏళ్లు తగ్గిపోనున్నట్లు ఓ అధ్యయనం వెల్లడించింది. చికాగోలోని ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్పై డేటాను విడుదల చేసింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన సగటు ఆరోగ్య స్థాయి కన్నా ఎక్కువ స్థాయిలో కాలుష్యం ఉన్నట్లు తెలిపారు. దేశంలో 67 శాతం మంది తీవ్ర కాలుష్య పరిస్థితుల్లోనే రోజులు గడుపుతున్నట్లు తెలిపారు. పంజాబ్లోని పఠాన్కోట్ ప్రాంతంలో పార్టికులేట్ పొల్యూషన్ డబ్ల్యూహెచ్వో సూచించిన స్థాయి కన్నా ఏడు రెట్లు ఎక్కువగా ఉంది.
ఒకవేళ కాలుష్య తీవ్రత ఇదే స్థాయిలో కొనసాగితే అప్పుడు జీవితకాలం 3.1 సంవత్సరాలు తగ్గనున్నదని రిపోర్టు తెలిపింది. ఢిల్లీ ప్రాంతంలో మిగితా దేశంతో పోలిస్తే సాంద్రత మూడు రెట్లు ఎక్కువగా ఉందని రిపోర్టులో తెలిపారు.
వాహనాలు, నిర్మాణాలు, వ్యవసాయం వల్ల కూడా కాలుష్యం అధికంగా ఉన్నట్లు గుర్తించారు. కాలుష్య వాయువులను పీల్చడం వల్ల బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్థాన్, చైనా, నైజీరియా, ఇండోనేషియా దేశాల ప్రజలు ఆరేళ్ల వరకు తమ జీవితకాలాన్ని కోల్పోనున్నట్లు అంచనా వేస్తున్నారు.