బ్రిటిష్కాలం నాటి దోశద్రోహ చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. విచారణ సమయంలో పిటిషన్ విచారణను వాయిదా వేయాలని కేంద్రం ప్రభుత్వం విజ్ఞప్తిని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది.
అయితే, దేశద్రోహ చట్టం (ఐపీసీ 124ఎ) స్థానంలో కేంద్రం కొత్తగా ‘భారతీయ న్యాయ సంహిత’ కోడ్ను తీసుకువచ్చేందుకు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేసు విచారణను వాయిదా వేయాలని కోర్టును కోరారు.
ఈ మేరకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేంద్రం విజ్ఞప్తిని తిరస్కరించింది. ఐదుగురు న్యాయమూర్తులు, ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనంతో రాజద్రోహం చట్టం సవాల్ను విచారించవచ్చని కోర్టు పేర్కొంది.
కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్లో కేసును ప్రస్తావించిన సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ ద్వారా కేసును విచారించేందుకు వీలుగా పత్రాలను అందుబాటులో ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఐపీసీలోని సెక్షన్ 124ఏ నిబంధనను పునః పరిశీలించాలని నిర్ణయించినట్లు గతంలో కేంద్రం అఫిడవిట్ సమర్పించింది.
దేశద్రోహ చట్టం కింద కొత్తగా ఎలాంటి కేసులు నమోదు చేయొద్దని గతేడాది మేలో సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించింది. సెక్షన్ 124ఏపై ప్రభుత్వం చేపట్టిన కసరత్తు పూర్తయ్యే వరకు సెక్షన్ 124ఏ కేసులను విచారణను సైతం నిలిపివేయాలని అప్పటి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
ఆయా పిటిషన్లు మంగళవారం విచారణకు రాగా, కేంద్రం కొత్త చట్టం ప్రతిపాదించిన నేపథ్యంలో విచారణను వాయిదా వేయాలని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి కోరారు. కొత్త ప్రతిపాదిత చట్టాలను ప్రస్తుతం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలిస్తున్నదని తెలిపారు.
