ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు, ముగ్గురు సభ్యులు గొండు సీతారాం, త్రిపర్ణ ఆదిలక్ష్మి, బత్తుల పద్మావతి గురువారం (14న) అలిపిరి కాలి నడక ద్వారా తిరుమల చేరుకుంటారని తెలిపారు. జూన్ 23న చిరుత బారినపడి కౌశిక్ అనే బాలుడు గాయాలు అయ్యాయి అని, మళ్ళీ ఈ ఆగస్టు 12 వ తేదీన లక్షిత అనే చిన్నారి చిరుత పులి దాడికి బలై ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఈ పర్యటన జరుపుతున్నారు.
అలిపిరి మార్గం ద్వారా సంఘటన జరిగిన ప్రాంతాలను సందర్శించి, పరిశీలన చేసి ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా తదుపరి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, చర్యలకు సిపార్సుల ను చేయనున్నారు. తిరుమల చేరుకున్నాక దేవదాయ శాఖ అధికారులు, అటవీ శాఖ అధికారులు, పోలీసు నిఘా విభాగంతో సంఘటనలుపై ఆరా తీసి చర్చిస్తారు.
తర్వాత తిరుమలలో బాల్య వివాహాలు జరగకుండా చేపడుతున్న చర్యలును పరిశీలించి, బిక్షాటన, బాలకార్మికులు నివారణ కోసం చేపడుతున్న చర్యలు గురించి చర్చిస్తారు. తిరుమలలో నిర్వహిస్తున్న వేద పండిత పాఠశాలను కూడా సందర్శిస్తారు.
నడక మార్గాల కోసం దీర్ఘకాలిక ప్రణాళిక
కాగా, యాత్రికుల భద్రతతోపాటు వన్యప్రాణుల సంరక్షణ రెండూ ముఖ్యమేనని, తిరుమల నడకమార్గాల్లో ఎత్తయిన నడకమార్గాలు ఏర్పాటుకు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వైల్డ్ లైఫ్ చీఫ్ వార్డెన్ మధుసూధన్ రెడ్డి వెల్లడిరచారు. క్రూరమృగాలు దగ్గరకు రాకుండా ఈ మార్గాలను సురక్షిత జోన్లుగా మార్చడమే రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ లక్ష్యమని తెలిపారు.
యాత్రికులకు జంతువులు తారసపడకుండా చేపట్టాల్సిన స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలపై టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డితో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. చిరుత దాడిలో ఆరేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన తరువాత తిరుమల కాలిబాట మార్గాలు, ఘాట్ రోడ్లలో భద్రతా చర్యలను ముమ్మరం చేసినట్టు తెలిపారు.
ఏడో మైలు నుండి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు 20 రియల్ టైమ్ హై-ఫై కెమెరాలు, మరో 300 కెమెరా ట్రాప్లను ఏర్పాటు చేశామన్నారు. మరో 500 అధునాతన సిమ్ బేస్డ్ రియల్ టైమ్ కెమెరా ట్రాప్ లను కొనుగోలు చేసి ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటివరకు 5 చిరుతలను బందించి ఎస్వీ జూపార్కుకు తరలించామని తెలిపారు.
నడకమార్గాల్లో సాధారణ స్థితి నెలకొనే వరకు సెక్యూరిటీ గార్డు తోడుగా 100 మంది భక్తులను గుంపులుగా పంపడం, 12 ఏళ్లలోపు పిల్లలను మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అనుమతించడం, ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలు అనుమతించడం వంటి చర్యలు కొనసాగుతాయని ఆయన చెప్పారు.