ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో రెండు రోజుల పాటు సాగిన సీఐడీ విచారణ ఆదివారం ముగిసింది. విచారణ అనంతరం చంద్రబాబును వర్చువల్గా విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరు పరచగా చంద్రబాబును మరికొన్ని రోజులు కస్టడీకి అనుమతించాలంటూ సీఐడీ అధికారులు మెమో దాఖలు చేశారు.
చంద్రబాబును కొన్ని ప్రశ్నలు అడిగిన న్యాయమూర్ రిమాండ్ను మరో 11 రోజులు, అంటే అక్టోబర్ 5వ తేదీ వరకు పొడిగిస్తూ తీర్పునిచ్చారు. ఇప్పుడే అంతా అయిపోయిందని భావించాల్సిన అవసరం లేదని చంద్రబాబుతో న్యాయమూర్తి పేర్కొన్నారు. మీరు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని చంద్రబాబుతో చెప్పిన న్యాయమూర్తి ఈ కేసులో విచారణ ప్రక్రియ ఇంకా ఉందని తెలిపారు.
స్కిల్ స్కాం కేసుకు సంబంధించి ప్రాథమిక సాక్ష్యాలను సీఐడీ కోర్టుకు సమర్పించిందని ఆమె తెలిపారు. విచారణ సమయంలో అధికారులు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా ?అని చంద్రబాబును ఏసీబీ న్యాయమూర్తి అడగగా ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని చంద్రబాబు సమాధానమిచ్చారు.
మొదటి రోజు 11.30 గంటలకు విచారణ మొదలైందని సీఐడీ అధికారి చెప్పగా అది నిజమేనా? అని న్యాయమూర్తి అడిగి తెలుసుకున్నారు. థర్డ్ డిగ్రీ ఏమైనా ప్రయోగించారా? అని కూడా న్యాయమూర్తి అడిగారు. అయితే తాను విచారణకు పూర్తిగా సహకరించానని జడ్జికి చంద్రబాబు తెలిపారు.
వైద్య పరీక్షలు నిర్వహించారా? అని కూడా అడిగి తెలుసుకున్నారు. అయితే, చంద్రబాబు బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉందని, దానిపై సోమవారం వాదనలు వింటామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తెలిపారు. కాగా, విచారణలో అధికారులు ఏం గుర్తించారో బయటపెట్టాలని న్యాయమూర్తిని చంద్రబాబు కోరారు. దానికి విచారణ సమయంలో అలాంటి విషయాలు బయటపెట్టడం సరికాదని చంద్రబాబుకు జడ్జి బదులిచ్చారు. విచారణ ఇంకా చేయాల్సి ఉందని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, సీఐడీ రిమాండ్ పొడిగింపు పిటిషన్పై ఆదేశాల సమయంలో చంద్రబాబు లాయర్లపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఒకటికి పది పిటిషన్లు వేయడం వల్ల విచారణ చేయడం ఎలా? అని ప్రశ్నించారు. ఒకే అంశంపై వరుస పిటిషన్ల వల్ల కోర్టు సమయం వృథా అవుతుందని ఆమె తెలిపారు.