తెలంగాణ గవర్నర్ డా. తమిళి సై సౌందరరాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీలుగా రాష్త్ర మంత్రివర్గం సిఫార్సు చేసిన కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ పేర్లను ఆమె తిరస్కరించారు. కేబినెట్ సిఫార్సు చేసిన అభ్యర్థులకు తగిన అర్హతలు లేవని గవర్నర్ పేర్కొన్నారు. ఆర్టికల్ 171 (5) ప్రకారం అర్హతలు సరిపోవని ఆమె స్పష్టం చేశారు.
నామినేటెడ్ కోటాకు తగిన అర్హతలు లేని అభ్యర్థులను నామినేట్ చేయడం తగదని ఆమె హితవు చెప్పారు. తగిన అర్హతలు ఉన్న ఎంతో మంది ప్రముఖులు రాష్ట్రంలో ఉన్నారని ఆమె తెలిపారు. అర్హుల పేర్లను పరిగణనలోకి తీసుకోకుండా రాజకీయ కారణాలతో కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ పేర్లను సిఫార్సు చేయడం సరైంది కాదని ఆమె స్పష్టం చేశారు.
ఇలా చేయడంతో ఆయా రంగాల్లో పరిజ్ఞానం, అనుభవం ఉన్న వారికి గుర్తింపు లభించనట్లే అవుతుందని ఆమె పేర్కొన్నారు. నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎవరిని ఎంపిక చేయాలో ప్రజాప్రాతినిధ్య చట్టంలో స్పష్టంగా ఉందని ఆమె గుర్తు చేశారు. మంత్రి మండలి సిఫార్సులో ఈ విషయాలను స్పష్టం చేయలేదని గవర్నర్ తమిళి సై వెల్లడించారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వారి పేర్లు తిరస్కరించాలని గవర్నర్ సీఎం, మంత్రి వర్గానికి ఈ సందర్భంగా సూచించారు.
తెలంగాణలో గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ వివాదం కొంతకాలంగా కొనసాగుతోంది. గతంలో పాడి కౌశిక్ ను ఎమ్మెల్సీగా సిఫార్సు చేయడం, ఆర్టీసీ బిల్లు పెండింగ్, ప్రోటోకాల్ వివాదం…గత నాలుగేళ్లుగా గవర్నర్ తమిళి సై , బీఆర్ఎస్ ప్రభుత్వం వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. తాజాగా నామినేటెడ్ ఎమ్మెల్సీల పేర్లను గవర్నర్ తిరస్కరించడంతో మరోసారి వివాదం నెలకొంది.
ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన పలు బిల్లులను గవర్నర్ ఉద్దేశపూర్వకంగా పెండింగ్ పెట్టడం, వివరణ కోరడం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. గవర్నర్ తీరుపై మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సర్కారియా కమిషన్ సిఫార్సుల ప్రకారం గవర్నర్గా తమిళిసై అనర్హులు అని స్పష్టం చేశారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు ఎలా గవర్నర్ అయ్యారని ఆయన మండిపడ్డారు. సామాజిక సేవను రాజకీయాల్లో ఒక భాగంగానే చూడాలని స్పష్టం చేశారు.