ఏపీ హైకోర్టులో చంద్రబాబునాయుడుకు బిగ్ షాక్ తగిలింది. టిడిపి అధినేత చంద్రబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసింది. అంగళ్లు, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది.
మరోవంక, టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టులో కూడా నిరాశ ఎదురయింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. ఇదే సమయంలో సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పొడిగింపు పిటిషన్ ను కూడా కోర్టు డిస్మిస్ చేసింది.
మరోవైపు, చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో పెండింగ్లో ఉన్న పీటీ వారెంట్లపై విచారణ ప్రారంభమైంది. ఆయన తరఫు లాయర్లు వాదనలు వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా పీటీ వారెంట్లపై విచారణ అవసరం లేదని, కోర్టు నిర్ణయం తీసుకుంటే చాలని సీఐడీ తరఫు లాయర్లు వాదించారు. దీనికి చంద్రబాబు లాయర్లు కౌంటర్ ఇస్తూ.. వాదనలు వినిపించవచ్చని జడ్జికి వివరించారు.
ఇది ఇలా ఉండగా, చంద్రబాబు అరెస్టుకు నెల రోజులు పూర్తి అయింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేటికీ నెల రోజులు అయింది. గత నెల 9న ఉదయం 6:15 గంటలకు చంద్రబాబును అరెస్టు చేసినట్లు సిఐడి ప్రకటించింది.
ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు రోడ్డు మార్గాన విజయవాడ తీసుకెళ్లారు. 10న ఉదయం 6 గంటలకు ఎసిబి కోర్టులో హాజరుపరచగా…. జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తూ సాయంత్రం 6:45 గంటలకు తీర్పు వెలువడింది. అర్ధరాత్రి 1:20 గంటలకు ఆయన జైల్లోకి వెళ్లారు.